12 ఏళ్ల వయసులో ఏబీసీడీలు నేర్చుకున్నాను

12 ఏళ్ల వయసులో ఏబీసీడీలు నేర్చుకున్నాను

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వీడ్కోలు సభను సుప్రీంకోర్టులో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలో తన ప్రస్థానం గురించి వివరించారు. తనకు, తన కుటుంబానికి ఆశీర్వచనాలు అందించేందుకు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.  తన జీవిత ప్రయాణం కృష్ణా జిల్లాలోని పొన్నవరం అనే మారుమూల గ్రామంలో మొదలైందని ఎన్వీ రమణ గుర్తు చేసుకున్నారు. ‘‘మా ఊరిలో విద్యుత్ సౌకర్యం, రోడ్డు సౌకర్యం, కనీస వసతులు ఉండేవి కావు. తొలిసారి నేను మా ఊళ్లో కరెంటును 12 ఏళ్ల వయసులో చూశాను. సరిగ్గా అదే ఏడాది నేను మొదటిసారి ఇంగ్లిష్ ఏబీసీడీలను నేర్చుకున్నాను’’ అని బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలబడాలనే పాఠాన్ని తనకు గురువులు, తల్లిదండ్రులు నేర్పించారన్నారు. జీవిత అనుభవాలు కూడా తనకు అదే విషయాన్ని నేర్పాయని పేర్కొన్నారు.  ‘‘తొలితరం లాయర్ గా  నేను కెరీర్ ను ప్రారంభించినప్పుడు అడుగడుగునా సవాళ్లు  ఎదురయ్యాయి. వాటిని ఓపికతో అధిగమించాను.  విజయానికి షార్ట్ కట్ లేదని గుర్తించాను. కష్టపడటం ఒక్కటే మార్గమని తెలుసుకున్నాను’’ అని ఎన్వీ రమణ  వివరించారు. 

17 ఏళ్ల వయసులోనే ట్రేడ్ యూనియన్ కు సారథ్యం వహించా

‘‘నేను 17 ఏళ్ల వయసులోనే 10వేల మంది కార్మికులు సభ్యులుగా ఉన్న ట్రేడ్ యూనియన్ ను ముందుండి నడిపాను . అదే సమయంలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతు సంఘాల తరఫున పోరాడాను’’ అని చెప్పారు.  ‘‘ఎమర్జెన్సీ సమయంలో ఇబ్బందిపడిన ఎంతోమందిలో నేను కూడా ఒకణ్ని.  ఆ సమయంలో ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోయాను. ఒంటరిగా మిగిలిన సందర్భాల్లో..  ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో.. ఎలా మసులుకోవాలి ? అనేది నాకు ఎమర్జెన్సీ సమయంలో తెలిసొచ్చింది’’ అని ఆయన తెలిపారు. ‘‘న్యాయవాదిగా ఉన్న సమయంలో ఎన్నో సందర్భాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున వివిధ కోర్టుల్లో  వాదనలు వినిపించాను. న్యాయవాద వృత్తిలో నా సుదీర్ఘ ప్రయాణం చివరకు ఢిల్లీకి చేరింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవిని నిర్వర్తించే గొప్ప అవకాశం దక్కింది’’ అని వివరించారు. ‘‘మనిషి జీవన సంఘర్షణ క్రమంలో ఆశావాదం, ఆత్మ విశ్వాసం రెండూ అవసరం. నేను దేవుడిపై విశ్వసిస్తాను. వివిధ కోర్టుల్లో జడ్జిగా పనిచేసిన సమయాల్లో మనసు, మెదడు రెండింటిని నా పదవికి అంకితం చేశాను. వాటిపై పూర్తి దృష్టిపెట్టి నిబద్ధతతో పనిచేశాను’’ అని ఎన్వీ రమణ తన వీడ్కోలు ప్రసంగంలో తెలిపారు.