చల్లటి ప్రాంతాల్లో మలేరియా..

చల్లటి ప్రాంతాల్లో మలేరియా..

ఎండ కొంచెం పెరిగినా విజృంభణ

మొన్నటి వరకు చుర్రుమనిపించిన ఎండలు పోయి ఆకాశంలో మబ్బులు, అప్పుడప్పుడు జల్లులతో వాతావరణం భలే బాగుంది కదా.. ఉష్ణోగ్రతలు మరీ తగ్గిపోయాయి.. కాస్త పెరిగితే బాగుండనిపిస్తోందా.. సరిగ్గా మలేరియాను వెంటబెట్టుకొచ్చే దోమలు కూడా ఇలాగే ఫీలవుతున్నాయట. ఎండ కొంచెం పెరిగితే మలేరియా క్రిమి ఎదుగుదల వేగం పెరుగుతుందని, దీంతో ఎక్కువ మందికి మలేరియాను అంటిస్తాయని సైంటిస్టులు  చెబుతున్నారు. అమెరికాలోని పెన్ ​యూనివర్సిటీలో ఇటీవల మలేరియాకు కారణమయ్యే అనాఫిలిస్ ​స్టెఫెన్సి, అనాఫిలిస్ ​గాంబి రకాల దోమలపై జరిపిన రీసెర్చ్‌‌లో ఈ వివరాలు బయటపడ్డాయని అన్నారు.

ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు కాస్త అటు, ఇటూగా ఉండే మలేరియా పరాన్నజీవికి పండగేనని వారు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వందలు, వేలు, లక్షల మంది మలేరియా బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశోధనలో భాగంగా.. వ్యాధికారక దోమలను, వాటిలో వ్యాధి డెవలప్​మెంట్​ను వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద పరీక్షించి చూశామని పెన్ యూనివర్సిటీ సైంటిస్టులు చెప్పారు. ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉన్నపుడు మలేరియా క్రిములు చురుకుగా ఉంటున్నాయని, వ్యాధి వ్యాప్తి గరిష్ఠంగా ఉండే సమయమిదేనని అన్నారు. ఇక రాత్రిపూట చలి, పగటిపూట ఎండ పెరగడం వల్ల కూడా మలేరియా వ్యాపించే ప్రమాదం పెరుగుతుందన్నారు. దోమలో మలేరియా పరాన్నజీవి పూర్తిగా డెవలప్​కావడానికి కనీసం 56 రోజులు పడుతుందని ఇప్పటి వరకు సైంటిస్టులు భావించేవారు. తాజాగా, అనాఫలిస్​స్టెఫెన్సి దోమలో ఈ ప్రాసెస్​కు 31 రోజులు చాలని తేలిందన్నారు. ఉష్ణోగ్రతల్లో సహజంగా ఏర్పడే మార్పులు పరాన్నజీవి ఎదుగుదలను ప్రభావితం చేస్తున్నాయని ప్రొఫెసర్​మాథ్యూ థామస్​చెప్పారు. ఉష్ణోగ్రతల్లో మార్పులు మలేరియా వ్యాప్తిలో భారీగా ప్రభావం చూపుతాయని వివరించారు.