సీఎం కాన్వాయ్‌‌‌‌లో కల్తీ డీజిల్..బంక్‌‌‌‌ను సీజ్ చేసిన అధికారులు .. ఎక్కడంటే..!

సీఎం కాన్వాయ్‌‌‌‌లో కల్తీ డీజిల్..బంక్‌‌‌‌ను సీజ్ చేసిన అధికారులు .. ఎక్కడంటే..!
  • మధ్యప్రదేశ్​లో మార్గమధ్యలో ఆగిపోయిన 19 కార్లు

భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కాన్వాయ్‌‌‌‌లోని కార్లన్నీ ఒకేసారి బ్రేక్‌‌‌‌డౌన్ అయ్యాయి. ఒకదాని తర్వాత ఒకటి 19 కార్లు రోడ్డుపై ఆగిపోయాయి. కల్తీ డీజిల్ కారణంగానే వెహికల్స్‌‌‌‌ అన్నీ ఆగిపోయాయని గుర్తించి అధికారులు షాక్‌‌‌‌కు గురయ్యారు. అసలేం జరిగిందంటే.. 

రత్లాం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం మోహన్ యాదవ్ గురువారం రాత్రి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో రాత్రి 10 గంటలకు దోసిగావ్‌‌‌‌ వద్ద శక్తి పెట్రోల్‌‌‌‌ పంప్‌‌‌‌లో సీఎం కాన్వాయ్‌‌‌‌లోని అన్ని వాహనాలకు డీజిల్ కొట్టించారు. ఆ తర్వాత  కొద్ది దూరం వెళ్లాక కాన్వాయ్‌‌‌‌లోని కార్లు ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. సిబ్బంది వాటిని నెట్టుకుంటూ రోడ్డు పక్కన పార్క్ చేశారు. కల్తీ డీజిల్ కారణంగానే వెహికల్స్ బ్రేక్‌‌‌‌డౌన్ అయినట్టు గుర్తించారు. ఇండోర్‌‌‌‌‌‌‌‌ నుంచి మరో కాన్వాయ్‌‌‌‌ తెప్పించి సీఎంను పంపించారు.

అధికారుల పరుగులు.. 

సీఎం కాన్వాయ్ ఆగిపోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. చివరకు కల్తీ డీజిల్ కారణంగానే కార్లు ఆగిపోయాయని తేల్చారు. డీజిల్​ కొట్టించిన బంక్‌‌‌‌లోని శాంపిల్స్‌‌‌‌ను సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫీసర్లు సేకరించి పరీక్షించగా, నీళ్లు ఉన్నట్టు తేలింది. దీంతో శక్తి పెట్రోల్‌‌‌‌ పంప్‌‌‌‌ను కలెక్టర్ సీజ్ చేశారు. ‘‘మొదట ఒకట్రెండు కార్లు, ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్ని కార్లు ఆగిపోయాయి. 

కల్తీ డీజిల్ పోశారనే అనుమానంతో బంక్ సిబ్బందిని మేం ప్రశ్నించగా.. అలాంటిదేంలేదని వాళ్లు చెప్పారు. కానీ స్థానికుడు ఒకరు అదే పంప్‌‌‌‌ నుంచి బాటిల్‌‌‌‌లో పెట్రోల్ నింపుకుని తీసుకొచ్చి చూపించాడు. అప్పుడు అందులో నీళ్లు కలిపారని గుర్తించాం” అని సీఎం కాన్వాయ్‌‌‌‌లోని డ్రైవర్ చెప్పాడు.