
కరీంనగర్ లో బుధవారం ఒక్కరోజే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సీఎం కేసీఆర్.. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి.
మాకేమవుతుందిలే అని అనుకోవద్దు
ఈ వైరస్ విదేశాల నుండి వచ్చిన వారికే కానీ, తెలంగాణలో నివసిస్తున్న ఏ ఒక్కరికీ సోకలేదని చెప్పారు. ప్రభుత్వం సూచన మేరకు ఇప్పటికే చాలామంది మాస్క్ లు వాడుతూ, వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నారని చెప్పిన సీఎం.. ముందు ముందు ఇంకా జాగ్రత్తలు అవసరమని చెప్పారు. జనాలు మాకేమవుతుందిలే అని నిర్లక్ష్యం వదిలి , కఠిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముందన్నారు. థియేటర్లు, మాల్స్, బార్లు, పార్కులు మార్చి 31 వరకు మూసివేయాలని చెప్పారు. సభలు, ర్యాలీలు, సెమినార్లు నిర్వహించకూడదన్నారు.
ముందు జాగ్రత్తే శ్రీ రామరక్ష
ఈ ఏడాది నిర్వహించే ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాలు రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఎక్కడా నిర్వహించబోమని, ప్రజలంతా లైవ్ టెలికాస్ట్ ద్వారానే వీక్షించాలని చెప్పారు. అదేవిధంగా మసీదులు, చర్చిలు, దేవాలయాలు, గురుద్వారాలతో అన్ని మందిరాల్లోనూ భక్తులను రానివ్వొద్దని కోరారు. అన్ని మతాల పెద్దలూ ప్రజలు క్షేమం కోసం ఈ నియమాన్ని కఠినంగా పాటించాలని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలే మనకు శ్రీరామ రక్ష అని చెప్పారు.
మార్చి 31 వరకే పెళ్లిళ్లకు అనుమతి
ఈ నెల 31 లోపు జరుపుకునే పెళ్లిళ్లకే అనుమతి అని, ఆ తర్వాత అన్ని ఫంక్షన్ హాల్స్ మూసివేస్తామని కేసీఆర్ అన్నారు. ఒకవేళ ముందే నిర్ణయించుకున్న పెళ్లిళ్లు ఉంటే తక్కువ జనాభాతో జరుపుకోవాలని సూచించారు. అన్ని విద్యా సంస్థలు మూసి వేయాలన్నారు
నిత్యవసరాల దుకాణాలు తెరిచే ఉంటాయి
నిత్యవసరాల సరుకుల కోసం ప్రజలకు అందుబాటులో అన్ని దుకాణాలు తెరిచే ఉంటాయన్ని చెప్పారు సీఎం. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి ఆ సరుకులను బ్లాక్ మార్కెట్ చేస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కువమంది ఒకచోట గుమిగూడొద్దని, వైరస్ ను అడ్డుకునేందుకు ఇదే ఉత్తమ మార్గమని చెప్పారు.
పదవ తరగతి పరీక్షలు యథావిధిగా..
విద్యార్ధులు పరీక్షలకు అన్ని రకాలుగా సిద్ధమైన నేపథ్యంలో.. పదో తరగతి పరీక్షలు యథావిధిగానే కొనసాగిస్తామని సీఎం చెప్పారు . పరీక్షా కేంద్రాల్లో ప్రతీరోజూ శానిటైజ్ చేయాలని ఆయన సూచించారు. ప్రతీ రోజు టేబుల్స్, బెంచ్ లను శుభ్రం చేయాలని అన్నారు.
మళ్లీ సమీక్ష నిర్వహిస్తాం
అన్ని పబ్లిక్ ట్రాన్స్ పోర్టులలో శానిటేషన్ చేపట్టాలని ఆదేశించామన్నారు కేసీఆర్. క్యాబ్ లు, బస్సులు, రైళ్లు శుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. వైరస్ ని అరికట్టేందుకు ప్రస్తుతం ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని చెప్పిన ముఖ్యమంత్రి.. సమస్య తీవ్రతను బట్టి మళ్లీ నిర్ణయాలు తీసుకుంటామని, మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.