
వినతులతో వస్తున్న ఎమ్మెల్యేతో సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: వివిధ పనుల నిమిత్తం, నిధుల కోసం తన దగ్గరికొస్తున్న ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ నుంచి వింత అనుభవం ఎదురవున్నట్టు తెలిసింది. వచ్చినోళ్లను వచ్చినట్టు కూర్చోబెట్టి సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తున్నట్టు సమాచారం. వారం రోజుల క్రితం కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్కు వెళ్లి సీఎంను కలిశారు. వాళ్లందర్నీ చూడగానే.. ‘మీ చేతుల్లో తెల్ల కాగితాలు చూస్తే భయమేస్తోంది. దయచేసి ఈ పరిస్థితిలో నిధులు అడగొద్దు. వచ్చే బడ్జెట్ వరకు ఆగురి’ అని చెప్పినట్టు తెలిసింది.
‘పైసలివ్వడం లేదని వచ్చుడు మానేసేరు. అప్పుడప్పుడు రండి. చాయ్ తాగండి, ఆకలేస్తే భోజనం కూడా చేయండి’ అంటూ నవ్వుతూనే చెప్పాల్సింది చెప్పేశారట. ఇప్పట్లో ఎలాంటి ఆర్థిక పరమైన వినతులు తీసుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని సీఎం ఆదేశించారని తెలిసింది. దీంతో సీఎంఓ అధికారులు ఎలాంటి వినతులు తీసుకోవడం లేదని సమాచారం. ఎవరైన బలవంతంగా వినతి పత్రం ఇస్తే.. పక్కన పెట్టడమో, లేక వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామంటూ చెప్పి పంపుతున్నట్టు తెలిసింది.