తెలంగాణపై ఎందుకీ వివక్ష? మోదీ ఏం ఇచ్చిండు.. కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు?: సీఎం రేవంత్

తెలంగాణపై ఎందుకీ వివక్ష? మోదీ ఏం ఇచ్చిండు.. కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు?: సీఎం రేవంత్
  • బెంగళూర్, చెన్నై, ఏపీకి మెట్రో, గుజరాత్‌కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు
  • మూసీ, మెట్రో, ట్రిపుల్ ఆర్‌‌పై ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకుంటలే
  • హైదరాబాద్‌కు వస్తున్న అమిత్‌ షాను కలిసి మళ్లీ వినతిపత్రం ఇస్తం 
  • అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేస్తే సహించేది లేదు
  • ఎవరు కుట్రలు చేస్తున్నరో, ఎవరు అభివృద్ధి చేస్తున్నరో ప్రజలు గమనించాలి
  • గచ్చిబౌలి భూములపై వెనక్కి తగ్గం.. అక్కడ ఐటీ కంపెనీలు పెడ్తామని వెల్లడి 
  • పీజేఆర్ ఫ్లైఓవర్‌‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్, వెలుగు: రాజకీయాల ముసుగులో అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కొండాపూర్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు నిర్మించిన పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ ఏమిచ్చారో, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం తెచ్చారో చెప్పాలని ఆయన నిలదీశారు. ‘‘పీవీ నరసింహారావు వల్ల ఐటీ విప్లవం, మన్మోహన్ సింగ్ వల్ల మెట్రో అభివృద్ధి సాధ్యమైంది. మరి ప్రధాని మోదీ వల్ల ఏం సాధ్యమైంది? బెంగళూర్, చెన్నై, ఆంధ్రప్రదేశ్‌కు మెట్రో రైళ్లు, గుజరాత్‌కు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం..తెలంగాణపై మాత్రం ఎందుకు వివక్ష చూపుతున్నది” అని ప్రశ్నించారు.

‘‘ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? ఎవరు కుట్రలు చేస్తున్నారు? ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు? ఎవరు అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారు? అనేది ప్రజలు నిశితంగా గమనించాలి. హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. వచ్చే వందేండ్ల అవసరాలకు తగ్గట్టు హైదరాబాద్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకువెళ్తాం. నగరాన్ని న్యూయార్క్, టోక్యోలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతాం. ఈ క్రమంలో ఎవరు అడ్డుపడినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవాంతరాలను అధిగమిస్తూ ముందుకెళ్తాం. ఆనాడు దేవతలు యజ్ఞాలు చేసినప్పుడు కూడా రాక్షసులు వచ్చి..

ఆ యజ్ఞానికి భంగం కలిగించడానికి ప్రయత్నం చేశారు. అంతమాత్రాన దేవతలు చేసే యజ్ఞం ఆగిపోలేదు.. మేం కూడా అలాగే అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకెళ్తాం” అని తెలిపారు.ఇకనైనా రాజకీయాలు పక్కనపెట్టి, అభివృద్ధి కోసం కలిసిరావాలని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. 2028 తర్వాత ఎన్నికల గురించి మాట్లాడుకుందామని, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందామని సూచించారు. 

తెలంగాణకు మోదీ ఏం ఇచ్చారు? 

తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 8 మంది ఎంపీలను, 8 మంది ఎమ్మెల్యేలను రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే.. ఆ పార్టీ నేతలు రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు. ‘‘బెంగళూరు, చెన్నై, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు ప్రధాని మోదీ మెట్రో రైలు ఇచ్చారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌కు రూ.2లక్షల కోట్ల బుల్లెట్ ట్రైన్, సబర్మతి రివర్‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్ ఇచ్చారు. ఢిల్లీకి యమునా రివర్‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు గంగా రివర్‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్ ఇచ్చారు. కానీ మేం మూసీ రివర్‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్ అడిగితే ఇవ్వడం లేదు.. మెట్రో రైలు అడిగితే ఇస్తలేరు.. రీజినల్ రింగ్ రోడ్డు అడిగితే పట్టించుకుంటలేరు” అని మండిపడ్డారు.

తెలంగాణపై ఎందుకింత వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. ‘‘మేం ఎలాంటి భేషజాలు లేకుండా నగరాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను 30-–35 సార్లు ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులను కలిశాను. మూసీ, మెట్రో, ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తులు చేశాను. అమిత్ షా ఆదివారం హైదరాబాద్ వస్తున్నారు. ఆయనను మళ్లీ కలిసి.. రాష్ట్ర ప్రాజెక్టులపై వినతిపత్రాలు అందజేస్తాం. ఈ మూడు వస్తే హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతుంది” అని తెలిపారు. 

నాగార్జున రెండెకరాలు ఇచ్చారు.. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నాలాలు, చెరువుల కబ్జాలను తొలగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హీరో నాగార్జున వంటి ప్రముఖులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెరువు స్థలాలను అప్పగించారని చెప్పారు. ‘‘ఎన్ కన్వెన్షన్ దగ్గరున్న అక్రమ నిర్మాణాలను మా ప్రభుత్వం తొలగించింది. ఆ తర్వాత నాగార్జున స్వయంగా ముందుకొచ్చి అక్కడున్న చెరువు జాగా రెండు ఎకరాలను నన్ను కలిసి స్వచ్ఛందంగా అప్పగించారు. నగర అభివృద్ధిలో ఒక హీరోగా ముందుటానని ఆయన చెప్పారు’’ అని పేర్కొన్నారు. 

గచ్చిబౌలి భూములపై కొట్లాడుతాం..  

బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ నాయకుల కబ్జా నుంచి విడిపించి అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకా రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునేవాళ్లను క్షమించుకుంటూ పోదామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పని చేయకుండా కొందరు ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇయ్యాల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అయితే దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి.

అందుకే  గచ్చిబౌలి స్టేడియం పక్కన 400 ఎకరాలు అభివృద్ధి చేసి.. ఇంకో 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా రూ.లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని అమెరికా, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ లాంటి దేశాల్లో పర్యటనలు చేశాం. దాదాపు రూ.2.25 లక్షల పెట్టుబడులను ఆకర్షించి, ఆయా సంస్థలను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే.. పానకంలో పుడకలాగా దాన్ని అడ్డుకున్నరు.. ఇది తాత్కాలికమే. ఆ భూమి గత ప్రభుత్వం ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు కేటాయిస్తే, 2024లో సుప్రీంకోర్టు వరకు వెళ్లి కొట్లాడి భూమిని వెనక్కి తీసుకొచ్చినం. ఈరోజు ఎవరో కొందరు అడ్డంకులు కల్పించినంత మాత్రాన మా ప్రభుత్వం వెనక్కి తగ్గదు. చట్ట సభల్లోనే కాదు న్యాయస్థానాల్లో కొట్లాడి ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను ప్రారంభించి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తం” అని తెలిపారు. 

పీజేఆర్ ఇల్లు జనతా గ్యారేజ్.. ​ 

ఈ ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌కు పీజేఆర్ (పి.జనార్దన్ రెడ్డి) పేరు పెట్టడం సముచితమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘జంట నగరాల అభివృద్ధికి పీజేఆర్ ఎంతో కృషి చేశారు. పేదల సంక్షేమానికి పాటుపడ్డారు. పిలిస్తే పలికే నాయకుడిగా అందరికీ అండగా నిలబడ్డారు. దోమలగూడలోని ఆయన ఇల్లు ఎప్పుడు చూసినా జనాలతో కిటకిటలాడేది. సమస్యల పరిష్కారానికి అదొక జనతా గ్యారేజ్‌‌‌‌‌‌‌‌లా పేదలకు ధైర్యంగా, అండగా ఉండేది.    హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నీటి సమస్యను తీర్చడంలో పీజేఆర్ పోరాటం కీలకం. హైటెక్ సిటీ స్థాపనలో ఆయన కృషి అభినందనీయం” అని కొనియాడారు. హైదరాబాద్ అభివృద్ధికి ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, వాజ్‌‌‌‌‌‌‌‌పేయ్, మన్మోహన్ సింగ్, చంద్రబాబు నాయుడు కృషి చేశారని పేర్కొన్నారు. ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ స్మారకార్థం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు. పీజేఆర్ విగ్రహాన్ని కూడా పెడతామని చెప్పారు. అందుకు స్థలం గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

కిషన్ రెడ్డి.. ఇంకేం చేయాలి? 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటికి తానే స్వయంగా వెళ్లి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరానని, అయినప్పటికీ ఆయన పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘కిషన్ రెడ్డి.. నేను వ్యక్తిగతంగా మీ ఇంటికి వచ్చిన. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై  నివేదికలు ఇచ్చిన. ‘మీ వంతు సహకారం అందించండి. మావైపు నుంచి ఏమైనా లోపం ఉంటే చెప్పండి.. మేం సరిదిద్దుకుంటాం. మనం రాజకీయాలు పక్కనపెడదాం. ఆఖరి సంవత్సరంలోనే  రాజకీయాలు చేసుకుందాం. ఇప్పుడు అభివృద్ధిపై ఫోకస్​పెడదాం’ అని మీతో చెప్పిన. ఇంతకంటే ఏం చేయాలి?’’ అని ప్రశ్నించారు.

తాము ఇచ్చిన నివేదికల్లో ఏమైనా లోపం ఉందా? అవి స్పష్టంగా లేవా? తాము ఏమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నామా? అని నిలదీశారు. ‘‘ఎన్నో ఏండ్ల కిందనే ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్, మెట్రో కట్టుకున్నాం. ఢిల్లీ తర్వాత మెట్రోలో రెండో స్థానంలో ఉండే హైదరాబాద్.. ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయింది. గత పదేండ్లు తెలంగాణను పాలించిన వాళ్లతోనే ఈ పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న పట్టణాలు కూడా మెట్రో కట్టుకొని మనకంటే ముందర పోతున్నయ్. కిషన్ రెడ్డి.. ఇవన్నీ మీకు కనిపించడం లేదా?” అని ప్రశ్నించారు.

3 రీజియన్లుగా రాష్ట్రాభివృద్ధి..  

హైదరాబాద్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల కోర్ అర్బన్ రీజియన్‌‌‌‌‌‌‌‌గా, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ రీజియన్‌‌‌‌‌‌‌‌గా, దాని అవతల ఉన్న దాన్ని గ్రామీణ తెలంగాణగా విభజించి అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నామని వెల్లడించారు.

కోర్ అర్బన్ రీజియన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ప్రణాళికలు 100 రోజుల్లో సిద్ధమవుతాయని చెప్పారు. ‘‘ఢిల్లీ, చెన్నై, బెంగళూర్ వంటి నగరాలు ఎదుర్కొంటున్న కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాం. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాం. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతాం. ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహిస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై 100% పన్ను రద్దు చేశాం” అని వెల్లడించారు.