న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త అందించింది. ఈ ఏడాది లక్ష మందిని రిక్రూట్ చేసుకుంటామని ప్రకటించింది. 2022 కల్లా భారత్లో 45 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకుంటామని తెలిపింది. మొత్తంగా లక్ష ఐటీ ఉద్యోగులను రిక్రూట్ చేయనున్నట్లు ఆ సంస్థ సీఎండీ రాజేశ్ నంబియార్ తెలిపారు. ఈ ఏడాది కంపెనీ 17 వేల మందికి పైగా కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకున్నట్టు చెప్పారు. ఇంటర్న్షిప్లకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
అత్యంత ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్మెంట్విద్యార్థులతోపాటు ఇతర నిపుణుల నియామకాలను కొనసాగిస్తున్న సంస్థల్లో ఒకటిగా తాము నిలుస్తామని నంబియార్ స్పష్టం చేశారు. పోయిన ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా 20 వేల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను తమ సంస్థలో చేర్చుకున్నామని అన్నారు. నిపుణులను దక్కించుకోవడంలో కీలక కేంద్రాల్లో భారత్ ఒకటిగా ఉంటుందన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది.