వికారాబాద్, వెలుగు : తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు ఈ– కేవైసీ చేయించుకునేందుకు చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, మేనేజర్ కొండల్ రావు, రేషన్ దుకాణాల డీలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగ్యా నాయక్ మాట్లాడుతూ..
ఈ నెలాఖరులోగా జిల్లాలో వంద శాతం ఈ– కేవైసీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎవరైనా డీలర్లు రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే వారి డీలర్షిప్ను రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రేషన్ దుకాణాల అధ్యక్షుడు జూకా రెడ్డి, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.