ప్రీతి మీద హత్యాయత్నమే జరిగింది : తండ్రి నాగేందర్

ప్రీతి మీద హత్యాయత్నమే జరిగింది : తండ్రి నాగేందర్

హైదరాబాద్ నిమ్స్‭లో మెడికో ప్రీతికి చికిత్స కొనసాగుతోంది. ప్రీతి కేసును తారుమారు చేస్తున్నారని ఆమె తండ్రి నాగేందర్, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రీతిని అడ్మిట్ చేసి 24 గంటలు గడుస్తున్నా ఆమె ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ ఇవ్వలేదని నిమ్స్ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి మీద హత్యాయత్నమే జరిగి ఉంటుందని తండ్రి నాగేందర్ అనుమానిస్తున్నారు. తాను కంప్లైంట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కరోనా సమయంలో ప్రీతి భయపడకుండా పనిచేసిందని ఆమె తండ్రి అంటున్నారు. హెచ్ఓడీ నాగార్డునరెడ్డి కూడా ఇప్పటివరకు స్పందించలేదని ఆవేదన చెబుతున్నారు. ఇదిలా ఉంటే... విద్యార్థినిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు నిమ్స్ డాక్టర్లు తెలిపారు. డాక్టర్ పద్మజ నేతృత్వంలో ట్రీట్మెంట్ కొనసాగుతోందని చెప్పారు. అనస్తీషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, ఫిజీషియన్లతో చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు వెల్లడించారు.  

మరోవైపు.. ప్రీతి ఇష్యూ పై పోలీసులు, ప్రభుత్వం తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రీతి హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు వరంగల్ నుంచి మెడికల్ రిపోర్టులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రీతికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని విద్యార్థి సంఘాలు వెల్లడించాయి.