
జైపూర్: భార్యాభర్త మధ్య మనస్పర్థలు సహజం. కానీ.. ఆ మనస్పర్థలు, గొడవలు ముదిరి పాకాన పడితే ఆ కాపురంలో కల్లోలం ఖాయం. భార్యాభర్త మధ్య గొడవలు హత్యలకు, ఆత్మహత్యలకు దారితీసిన ఘటనలూ చూశాం. రాజస్థాన్లోని జైపూర్లో ఇలాంటి ఘటనే కలకలం రేపింది. సీసీటీవీ దృశ్యాలు భార్యాభర్త మధ్య జరిగిన గొడవను బయటపెట్టాయి. ఆ గొడవ జరిగిన గంటల వ్యవధిలోనే భార్య, భర్త శవాలై కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ధర్మేంద్ర చౌదరి బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య సుమన్, పిల్లలతో కలిసి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఈ కుటుంబం నివాసం ఉంటోంది. గురువారం రాత్రి 10 గంటల 56 నిమిషాల సమయంలో ఇద్దరూ కలిసి బయటకు వెళ్లొచ్చి కారులో అపార్ట్మెంట్లోకి వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించింది.
అయితే.. అంతకంటే ముందు.. కొన్ని గంటల క్రితం ధర్మేంద్ర, సుమన్ మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. గొడవ తర్వాత కారు పార్క్ చేసి వెళ్లిపోతున్న ధర్మేంద్రను ఆపి అతని భుజాలపై తల వాల్చి సుమన్ భావోద్వేగానికి గురైన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయి. అయితే.. ధర్మేంద్ర మాత్రం సుమన్ను నెట్టేసి వెళ్లిపోయాడు. ఏం జరిగిందో తెలియదు.. ఈ గొడవ జరిగిన కొన్ని గంటల తర్వాత భార్యాభర్త ఇద్దరూ.. బయటకు వెళ్లి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికొచ్చారు. తెల్లారేసరికి ధర్మేంద్ర ఇంట్లో ఉరేసుకుని విగత జీవిగా కనిపించాడు. సుమన్ ఫ్లోర్పై ప్రాణం లేని స్థితిలో ఉంది. దొంగతనం జరిగిన ఆనవాళ్లు ఏవీ కనిపించలేదు. ఆత్మహత్య అని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించినప్పటికీ సూసైడ్ నోట్ లాంటిదేమీ ఇంట్లో దొరకలేదు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
శుక్రవారం ధర్మేంద్ర బ్యాంకుకు వెళ్లకపోవడం, ఫోన్ కలవకపోవడంతో సహోద్యోగులు ధర్మేంద్ర ఫ్రెండ్కు సమాచారం అందించారు. ధర్మేంద్ర ఇంటికి అతని ఫ్రెండ్ వెళ్లి చూడగా డోర్ లోపలి వైపు లాక్ చేసి ఉంది. డోర్ బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ధర్మేంద్ర, అతని భార్య సుమన్ మృతదేహాలు కనిపించాయి. ధర్మేంద్ర ఒక ప్రైవేట్ బ్యాంకులో ఇన్సూరెన్స్ విభాగంలో మేనేజర్గా పనిచేస్తుండగా, అతని భార్య సుమన్ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుండటం గమనార్హం. ధర్మేంద్ర, సుమన్ ఇటీవలే ఫ్లాట్ కొన్నట్లు ఇరుగుపొరుగు చెప్పారు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఏవీ లేవని చెప్పుకొచ్చారు. ఈ కేసును హత్య కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలని సుమన్ తండ్రి కోరారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.