
ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్ ప్రధాన పాత్రల్లో సిరికి ఫణికృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. రాధామోహన్ నిర్మించారు. అక్టోబర్ 14న సినిమా రిలీజవుతున్న సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. గెస్ట్గా హాజరైన శర్వానంద్ మాట్లాడుతూ ‘ప్రస్థానం దగ్గర్నుంచీ సాయికుమార్ గారితో నాకు ప్రత్యేకమైన బాండింగ్ ఉంది. అందుకే ఆదిని తమ్ముడిలా ట్రీట్ చేస్తా. ట్రైలర్ చూస్తుంటే ‘రన్ రాజా రన్’ ఫ్లేవర్ కనిపిస్తోంది. ఆదికి మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నా’ అన్నాడు. మరో అతిథి సంపత్ నంది టీమ్కి బెస్ట్ విషెస్ చెప్పాడు. ఆది మాట్లాడుతూ ‘ఫస్ట్ టైమ్ హిలేరియస్ క్యారెక్టర్ చేశాను.
కంప్లీట్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నాడు. క్రేజీ ప్యాషనేట్ టీమ్తో వర్క్ చేసినందుకు ఆనందంగా ఉందంది మిర్నా. దర్శకుడు మాట్లాడుతూ ‘కొత్త ఆదిని చూస్తారు. ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో పాటు ప్రతిదీ కొత్తగా ఉంటుంది’ అన్నాడు. ‘సినిమా చాలా క్రేజీగా ఉంటుంది. నేను కూడా చిన్న క్యారెక్టర్ చేశాను. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’ అన్నారు నిర్మాత. నటులు నర్రా శ్రీనివాస్, అనీష్, మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.