మంచి మనసు చాటుకున్న చాహల్.. రైలు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

మంచి మనసు చాటుకున్న చాహల్..  రైలు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

ఒడిశా రైలు ప్రమాద ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తోంది. ఈ విషాదకర ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రులలో చికిత్సపొందుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో భాదితులను ఆదుకునేందుకు దాతలు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. చేసే సాయం చిన్నదా? పెద్దదా? అని కాకుండా తోచినంత ఇస్తున్నారు. తాజాగా భారత మిస్టరీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్..  రైలు ప్రమాద బాధితులకు లక్ష రూపాయలు విరాళం ఇచ్చాడు.  రైలు ప్రమాద బాధితుల కోసం 'స్కౌట్' అనే గేమింగ్ ఛానల్ నిర్వహిస్తున్న ఛారిటీ వర్క్‌కు అతడు ఈ డొనేషన్​ అందించాడు.

కాగా, ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తానని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ హామీ ఇవ్వగా.. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలల పాఠశాల విద్యకు అయ్యే ఖర్చును పూర్తిగా తామే భరిస్తామని అదానీ ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే, బాధితుల క్లెయిమ్​ల విషయంలో సడలింపులు ఇస్తామని దేశీయ భీమా సంస్థ ఎల్​ఐసీ ప్రకటించింది.