న్యూఢిల్లీ: బిట్కాయిన్ వంటి క్రిప్టోలు కరెన్సీ కాదని, ఎందుకంటే అవి లీగల్ టెండర్ కాదని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ స్పష్టం చేశారు. నియంత్రణ ఈజీగా ఉండేందుకు క్రిప్టో కరెన్సీలను సెపరేట్ ఎసెట్ క్లాస్గా గుర్తించడం మేలని అభిప్రాయపడ్డారు. వర్చువల్ కరెన్సీల పేరుతో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్కు గ్లోబల్గా చెక్ పెట్టేందుకు ఈ విధానం సాయపడుతుందని పేర్కొన్నారు. క్రిప్టో అంటే కరెన్సీ కాదనే విషయాన్ని చాలా సంవత్సరాల డిబేట్ తర్వాత పబ్లిక్ ఇప్పుడు పూర్తిగా అర్ధం చేసుకున్నారని గాంధీ చెప్పారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని క్రిప్టో కరెన్సీ తీసుకోవాల్సిందేనని వత్తిడి చేయలేడని, ఎందుకంటే అది లీగల్ టెండర్ కాదని పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీని ఎసెట్గానే పరిగణించాలనే చాలా దేశాల పాలసీ మేకర్లు ఆలోచిస్తున్నారని అన్నారు. క్రిప్టో కరెన్సీని పేమెంట్ ఇన్స్ట్రమెంట్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్ట్రమెంట్గా చూడటం సరయినది కాదని చెబుతూ, వీటి విషయంలో మనం గుర్తించగలిగిన ఇష్యూయర్ ఉండడని వివరించారు. సెపరేట్ ఎసెట్ క్లాస్గా క్రిప్టో కరెన్సీని మనం అంగీకరించగలిగితే, అప్పుడు రెగ్యులేషన్ సులభమవుతుందని గాంధీ చెప్పారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), బ్లాక్చెయిన్ అండ్ క్రిప్టో ఎసెట్ కౌన్సిల్ (బీఏసీసీ) ఏర్పాటు చేసిన వర్చువల్ కాన్ఫరెన్స్లో ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ మాట్లాడారు. రెగ్యులేషన్ లేకపోతే ఈ వర్చువల్ ఎసెట్ను క్రిమినల్ యాక్టివిటీస్ కోసం వాడే అవకాశాలే ఎక్కువని, ఇప్పటికే అలాంటివి మన అనుభవంలోకి వచ్చాయని గాంధీ పేర్కొన్నారు. ట్రేస్చేయడానికి, ట్యాక్స్ల విధింపునకు అందకుండా ఉండాలనే బేసిస్తోనే 12 ఏళ్ల కిందట క్రిప్టో కరెన్సీ పుట్టిందని ఆయన గుర్తు చేశారు. అయితే, ఏ సొసైటీలోనైనా కొన్ని రూల్స్ తప్పనిసరిగా ఉంటాయని, పాటించకపోతే చర్యలూ ఉంటాయని పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ కోసం దేశంలో తేవాలనుకుంటున్న చట్టం కేబినెట్ పరిశీలనలో ఉన్నట్లు కిందటి నెలలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వెల్లడించిన విషయం తెలిసిందే. క్రిప్టో కరెన్సీ విషయంలో ప్రభుత్వం, ఆర్బీఐల ఆలోచనా విధానంలో తేడాలు లేవని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఆ తర్వాత ప్రకటించారు.
క్రిప్టో యాడ్స్పై యాక్షన్..
క్రిప్టో కరెన్సీ యాడ్స్, ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు క్రిప్టోల గురించి ప్రకటనలు చేయడంపై చర్యలు ఉంటాయని బ్రిటన్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ ప్రకటించింది. తాజాగా యూఎస్ నటి కిమ్ కర్డాషియన్ చేసిన క్రిప్టో యాడ్లను ఈ సంస్థ ప్రస్తావించింది. కర్దాషియన్ తన 25 కోట్ల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను ఎథరమ్ మ్యాక్స్ కమ్యూనిటీలోకి జాయిన్ అవ్వండని పిలుపిచ్చారు. ఈ పోస్ట్కు ఆమె డబ్బులు తీసుకున్నారు కూడా. భారీ లాభాలు వస్తుండడంతో వర్చువల్ కరెన్సీల వైపు ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారు. కానీ, అనుభవం లేని ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు. ‘మన జీవితాలు రోజు రోజుకి ఆన్లైన్ మయమవుతున్నాయి. కొన్ని అంశాల్లో ఇతర బిజినెస్లకు అనుమతి లేనట్టే ఆన్లైన్ బిజినెస్లను కూడా అనుమతి లేదు’ అని ఎఫ్సీఏ తెలిపింది.
ఎల్సాల్వడార్లో బిట్కాయిన్ లీగల్ టెండర్ మనీ
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బిట్కాయిన్కు లీగల్ టెండర్ మనీగా స్టేటస్ వచ్చింది. గతంలో ప్రకటించిన విధంగానే క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ను మంగళవారం నుంచి అధికారికంగా చలామణీలోకి తెచ్చింది ఎల్సాల్వడార్ దేశం. ప్రభుత్వ అధికారిక వాలెట్ చివో ద్వారా 30 డాలర్ విలువైన బిట్కాయిన్లను అక్కడి ప్రజలకు ప్రభుత్వం ఇవ్వనుంది. వాటితో ఏమైనా కొనుక్కోవచ్చు. అంతేకాదు, 200 బిట్కాయిన్ ఏటీఎంలను కూడా ఆ దేశంలో ఏర్పాటు చేస్తున్నారు. చివో బ్రాండ్ పేరుతో నడిచే ఈ కియోస్క్లలోని స్టాఫ్ అక్కడికి వచ్చే కన్జూమర్లకు బిట్కాయిన్ను పరిచయం చేస్తారు.
దేశంలోకి క్రిప్టో ఎక్స్ చేంజి క్రాస్టవర్
బిజినెస్డెస్క్, వెలుగు: క్రిప్టో ట్రేడింగ్ ఎక్స్చేంజి క్రాస్టవర్ మంగళవారం ఇండియాలో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. క్రిప్టోకంపార్ డేటా ప్రకారం, గ్లోబల్గా 152 క్రిప్టో ఎక్స్చేంజిలు ఉంటే అందులో క్రాస్టవర్కు నాల్గో ర్యాంక్ వచ్చింది. అసెట్స్, మార్కెట్ క్వాలిటీ, డేటా, సెక్యూరిటీ, కేవైసీ, రెగ్యులేషన్స్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్ను ఇచ్చారు. తక్కువ ధరలకే యూజర్లకు సర్వీస్లను అందించడంతో పాటు, కస్టమర్లను రక్షించేందుకు టాప్ సెక్యూరిటీ చర్యలను తీసుకుంటున్నామని క్రాస్టవర్ పేర్కొంది. ఇండియాలో అడుగుపెడుతున్న సందర్భంగా మొదటి 1000 మంది కస్టమర్లకు వారి ఫస్ట్ ట్రేడ్పై రూ.500 వరకు విలువైన బిట్కాయిన్ను ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. కిందటేడాది ఏప్రిల్లో దేశ క్రిప్టోకరెన్సీ మార్కెట్ 923 మిలియన్ డాలర్లుగా ఉంది.