
హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. ట్రేడింగ్, షేర్ మార్కెట్, తక్కువ టైమ్లో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్నారు. ఈ ఏడాది 6 నెలల్లోనే 8,866 మంది ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ మోసాల బారినపడ్డారు. వీరి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ.170.65 కోట్లు కొట్టేశారు.
సైబర్ సేఫ్టీపై పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా.. కొందరు అత్యాశకు పోయి, మరికొందరు అవగాహన లేక డబ్బులు కోల్పోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు సగటున 310కి పైగా ఫిర్యాదులు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందుతున్నాయి. వీళ్లు యావరేజ్గా సుమారు రూ.4 కోట్ల వరకు కోల్పోతున్నారు. ఈ ఏడాది మొదటి 6 నెలల వ్యవధిలో 55,773 ఫిర్యాదులు అందగా.. 41,172 కేసుల్లో బాధితులు రూ.681 కోట్లు కోల్పోయారు.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 10.67 లక్షల ఫిర్యాదులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా అందాయి. వీటిలో రూ.9,591.41 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచేశారు. కాగా, రాష్ట్రంలో నమోదైన 189 కేసుల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు చేసింది. రూ.92 కోట్లు కొల్లగొట్టిన 228 మంది సైబర్ క్రిమినల్స్ను అరెస్ట్ చేసింది. వీరికి దేశవ్యాప్తంగా నమోదైన 1,313 నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించింది.