- విదేశీ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయని అంచనా
- 767 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- రూ. 2.77 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
- ఎంఎస్సీఐ ఇండెక్స్లోకి కొత్తగా ఏడు షేర్లు చేరుతుండటమే కారణం
బిజినెస్ డెస్క్, వెలుగు: బెంచ్మార్క్ ఇండెక్స్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషన్ (ఎంఎస్సీఐ) సెమీ యాన్యువల్ మీటింగ్ బుల్స్కు పాజిటివ్గా మారడంతో మార్కెట్లు లాభాల్లో ముగియగలిగాయి. బెంచ్మార్క్ ఇండెక్స్లు పడతాయని షార్ట్ చేసిన ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను సడెన్గా క్లోజ్ చేసుకున్నారని, అందుకే సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయని ఇన్వెస్టర్లు పేర్కొన్నారు. కాగా, ఎంఎస్సీఐ ఇండియా ఇండెక్స్లో కొత్తగా ఏడు షేర్లను యాడ్ చేయాలని మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ నిర్ణయించుకుంది. దీంతో ఈ ఏడు షేర్లలోకి సుమారు రూ. 10 వేల కోట్ల ఇన్ఫ్లోస్ వస్తాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్ నవంబర్ ఫ్యూచర్స్లో షార్ట్స్ను ఇన్వెస్టర్లు శుక్రవారం సెషన్లో కవర్ చేయడం గమనించొచ్చని తెలిపారు. షార్టింగ్ అంటే మార్కెట్ పడుతుందని పొజిషన్ తీసుకోవడం. సడెన్గా పాజిటివ్ న్యూస్ రావడంతో ఇన్వెస్టర్లు భయపడి తమ పొజిషన్లను క్లోజ్ చేసుకున్నారు. అంటే ముందు అమ్మిన కాంట్రాక్ట్లను ఇప్పుడు కొన్నారు. కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్ లాభపడింది. సెన్సెక్స్ శుక్రవారం 767 పాయింట్లు (1.28 శాతం) పెరిగి 60,687 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 229 పాయింట్లు లాభపడి 18,103 వద్ద ముగిసింది. కానీ, బ్రాడ్ మార్కెట్ నెగెటివ్లో క్లోజయ్యింది. ఎన్ఎస్ఈలో మొత్తం 2,054 షేర్ల ట్రేడవ్వగా, 943 షేర్లు లాభపడ్డాయి. 1,030 షేర్లు నష్టపోయాయి.
ఐటీ షేర్లు పెరిగాయి..
ఐటీ షేర్లలో గత కొన్ని కొన్ని సెషన్ల నుంచి అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. శుక్రవారం సెషన్లో ఈ షేర్లలోని షార్ట్లే ఎక్కువగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.1 శాతం లాభపడ్డింది. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 0.5 % పెరిగింది. ఇన్ఫ్లేషన్, వడ్డీ రేట్ల పెంపు భయాలు, గ్లోబల్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉండడం వంటి కారణాలతో ఈ వారం మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయని ఎనలిస్టులు తెలిపారు. కానీ, వారం చివరిలో ఇండెక్స్లు పాజిటివ్గా ముగియగలిగాయన్నారు.
ఎంఎస్సీఐ ఇండెక్స్లో జొమాటో, ఐఆర్సీటీసీ..
ఎంఎస్సీఐ ఇండియా ఇండెక్స్లో కొత్తగా ఏడు షేర్లు యాడ్ అవ్వనున్నాయి. ఇందులో జొమాటో, ఐఆర్సీటీసీ, ఎస్ఎఫ్ఆర్, గోద్రేజ్ కన్జూమర్ ప్రాపర్టీస్, టాటా పవర్, మైండ్ట్రీ, ఎంఫసిస్ షేర్లు ఉన్నాయి. ఇప్కా ల్యాబ్స్, ఆర్ఈసీ షేర్లను ఈ ఇండెక్స్ నుంచి తొలగిస్తారు. ఈ నెల 30 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. కొత్తగా యాడ్ అయిన ఈ ఏడు షేర్లలోకి1.4 బిలియన్ డాలర్ల (రూ.10,500 కోట్ల) విదేశీ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని ఎడెల్వీస్ రీసెర్చ్ అంచనావేస్తోంది. ఈ మార్పులు అమల్లోకి వచ్చాక టాటా పవర్లోకి రూ.1,800 కోట్లు, ఎస్ఆర్ఎఫ్లోకి రూ. 1 ,733 కోట్లు, మైండ్ట్రీలోకి రూ. 1,500 కోట్లు, ఐఆర్సీటీసీలోకి రూ. 1,283 కోట్ల విదేశీ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని ఎడెల్వీస్ అంచనావేసింది. జొమాటోలోకి రూ. 1,135 కోట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్కా ల్యాబ్స్ నుంచి రూ. 800 కోట్లు, ఆర్ఈసీ నుంచి రూ. 758 కోట్లు బయటకు వెళ్లిపోవచ్చని లెక్కించింది.
ఫినో పేమెంట్స్ మెప్పించలే..
ఫినో పేమెంట్స్ బ్యాంక్ షేర్లు మార్కెట్లో భారీ లాస్తో లిస్ట్ అయ్యాయి. కంపెనీ షేర్లు ఐపీఓ ధర రూ. 577 కంటే 5 శాతం తగ్గి రూ. 544 వద్ద ఎన్ఎస్ఈలో లిస్ట్ అయ్యాయి. లిస్టింగ్ ధర నుంచి మరో 1.63 శాతం తగ్గి రూ. 535.45 వద్ద క్లోజయ్యాయి. కంపెనీ ఐపీఓ 2.03 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ఈ పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 29 న ఓపెన్ అయ్యి, నవంబర్ 1 న ముగిసింది. ఈ ఐపీఓ ద్వారా రూ. 1,200 కోట్లను కంపెనీ సేకరించింది.