న్యూఢిల్లీ: టెర్రరిస్టులపై మరోమారు సెక్యూరిటీ ఫోర్సెస్ విరుచుకుపడ్డాయి. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులను మట్టుపెట్టినట్లు అధికారులు శనివారం తెలిపారు. తెల్లవారు జామున షోపియాన్లోని అంషీపొరాలో ఎదురుకాల్పులు మొదలయ్యాయని పోలీసు అధికారి చెప్పారు. శుక్రవారం సౌత్ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ముగ్గురు టెర్రరిస్టులను చంపామని పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఓ జైషే మహ్మద్ కమాండర్ కూడా ఉన్నట్లు సమాచారం. అతడు ఐఈడీ నిపుణుడు అని తెలుస్తోంది.
టెర్రరిస్టులను మట్టుపెట్టడానికి పోలీసులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇందుకు ఓ పోలీసు అఫీషియల్ చేసిన వ్యాఖ్యలు ఊతం ఇస్తున్నాయి. పలు టెర్రరిస్టు గ్రూప్లకు చెందిన టాప్ కమాండర్స్ లిస్ట్ను తయారు చేసి, దాని ప్రకారం వచ్చే కొన్ని నెలల్లో వారిని ట్రాక్ చేసి నిర్వీర్యం చేయనున్నట్లు కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. కాగా, జూన్లో లోయలో జరిపిన పలు ఎన్కౌంటర్స్లో 48 మంది టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ తుద ముట్టించాయి. వీటిలో ఎక్కువ దాడులు సౌత్ కాశ్మీర్లోని నాలుగు జిల్లాల్లోనే జరగడం గమనార్హం.