రంజిత్​రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

రంజిత్​రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల, వెలుగు: భారతదేశాన్ని 2047 నాటికి ప్రపంచంలో అగ్రభాగన నిలపడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ఏకైక నాయకుడు మోదీ మాత్రమేనన్నారు. మరోసారి ఆయన్ని ప్రధానిని చేయాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపై ఉందన్నారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్న యువతీయువకులు నరేంద్ర మోదీకి వేయాలని కోరారు.

చేవెళ్లలో ఈసారి బీజేపీ జెండా ఎగరబోతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. రంజిత్​రెడ్డి బీఆర్ఎస్ లోఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలను వేధించాడని, వాళ్లంతా ఇప్పుడు రంజిత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి, బుల్కాపురం గ్రామాలకు చెందిన వంద మంది బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి విశ్వేశ్వర్​రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చేవెళ్ల కన్వీనర్ కేఎస్ రత్నం, ప్రభాకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.