కాంగ్రెస్​ తెలంగాణ ఇన్​చార్జ్​గా దీపాదాస్​ మున్షీ

కాంగ్రెస్​ తెలంగాణ ఇన్​చార్జ్​గా దీపాదాస్​ మున్షీ
  •     జనరల్​ సెక్రటరీగా కూడా..
  •     అసెంబ్లీ ఎన్నికల టైంలో రాష్ట్ర చీఫ్​ అబ్జర్వర్​గా పనిచేసిన మున్షీ
  •     మాణిక్​రావ్​ ఠాక్రేకు గోవా, దాద్రా నగర్​ హవేలి, డయ్యూ డామన్​ బాధ్యతలు 

న్యూఢిల్లీ/హైదరాబాద్​, వెలుగు: లోక్​సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్​ హైకమాండ్​ పార్టీలో కొన్ని వ్యవస్థాగత మార్పులు చేసింది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ జనరల్​ సెక్రటరీలు, ఇన్​చార్జులను మార్చింది. కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​గా, జనరల్​ సెక్రటరీగా దీపాదాస్​ మున్షీని నియమించింది. కేరళ, లక్షద్వీప్​తో పాటు అదనంగా ఆమెకు తెలంగాణ బాధ్యతలను అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రానికి పార్టీ చీఫ్​ అబ్జర్వర్​గా పనిచేసిన మున్షీ.. పార్టీ నేతలను కో ఆర్డినేట్​ చేయడంలో సక్సెస్​ అయ్యారనే  పేరు పార్టీలో ఉన్నది. ఈ క్రమంలోనే దీపాదాస్​ మున్షీకి రాష్ట్ర బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రానికి  ఇన్​చార్జ్​గా ఉన్న మాణిక్​ రావ్​ ఠాక్రేకు గోవా, దాద్రానగర్​ హవేలి, డయ్యూ డామన్​కు ఇన్​చార్జ్​గా బాధ్యతలు అప్పగించారు. కాగా, ఎన్నికల టైంలో ఏఐసీసీ మీడియా కో ఆర్డినేటర్​గా తెలంగాణలో పనిచేసిన సీడబ్ల్యూసీ మెంబర్​ అజయ్​ కుమార్​ను ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి ఇన్​చార్జ్​గా నియమించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​గా ఉన్న మాణిక్కం ఠాగూర్​కు ఏపీ, అండమాన్​ నికోబార్​ బాధ్యతలను అప్పగించారు. మొత్తంగా 12 మందికి జనరల్​సెక్రటరీ, 12 మందికి ఇన్​చార్జ్​ బాధ్యతలను కాంగ్రెస్​ అధిష్ఠానం అప్పగించింది. ఇక, ట్రెజరర్​గా అజయ్​ మాకెన్​, జాయింట్​ ట్రెజరర్లుగా మిలింద్​ దేవరా, విజయ్​ ఇందర్​ సింఘ్లాను నియమించింది.