
- జనరల్ సెక్రటరీగా కూడా..
- అసెంబ్లీ ఎన్నికల టైంలో రాష్ట్ర చీఫ్ అబ్జర్వర్గా పనిచేసిన మున్షీ
- మాణిక్రావ్ ఠాక్రేకు గోవా, దాద్రా నగర్ హవేలి, డయ్యూ డామన్ బాధ్యతలు
న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ హైకమాండ్ పార్టీలో కొన్ని వ్యవస్థాగత మార్పులు చేసింది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ జనరల్ సెక్రటరీలు, ఇన్చార్జులను మార్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా, జనరల్ సెక్రటరీగా దీపాదాస్ మున్షీని నియమించింది. కేరళ, లక్షద్వీప్తో పాటు అదనంగా ఆమెకు తెలంగాణ బాధ్యతలను అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రానికి పార్టీ చీఫ్ అబ్జర్వర్గా పనిచేసిన మున్షీ.. పార్టీ నేతలను కో ఆర్డినేట్ చేయడంలో సక్సెస్ అయ్యారనే పేరు పార్టీలో ఉన్నది. ఈ క్రమంలోనే దీపాదాస్ మున్షీకి రాష్ట్ర బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రానికి ఇన్చార్జ్గా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేకు గోవా, దాద్రానగర్ హవేలి, డయ్యూ డామన్కు ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. కాగా, ఎన్నికల టైంలో ఏఐసీసీ మీడియా కో ఆర్డినేటర్గా తెలంగాణలో పనిచేసిన సీడబ్ల్యూసీ మెంబర్ అజయ్ కుమార్ను ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి ఇన్చార్జ్గా నియమించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న మాణిక్కం ఠాగూర్కు ఏపీ, అండమాన్ నికోబార్ బాధ్యతలను అప్పగించారు. మొత్తంగా 12 మందికి జనరల్సెక్రటరీ, 12 మందికి ఇన్చార్జ్ బాధ్యతలను కాంగ్రెస్ అధిష్ఠానం అప్పగించింది. ఇక, ట్రెజరర్గా అజయ్ మాకెన్, జాయింట్ ట్రెజరర్లుగా మిలింద్ దేవరా, విజయ్ ఇందర్ సింఘ్లాను నియమించింది.