ఫిఫా వరల్డ్‌కప్‌లో సెక్యూరిటీ వైఫల్యం?.. బెల్జియం vs సెనెగల్ మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్లోకి ఫ్యాన్ ఎంట్రీ

ఫిఫా వరల్డ్‌కప్‌లో సెక్యూరిటీ వైఫల్యం?.. బెల్జియం vs సెనెగల్ మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్లోకి ఫ్యాన్ ఎంట్రీ

Chaos at FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్‌ల్లో భాగంగా బెల్జియం వర్సెస్ సెనెగల్ జట్ల మధ్య జరిగిన పోరులో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే ఒకేసారి పలువురు గుర్తు తెలియని వ్యక్తులు (పిచ్ ఇన్వేడర్స్) భద్రతా వలయాన్ని ఛేదించుకుని స్టేడియంలోకి దూసుకురావడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో రెఫరీ వెంటనే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి వారిని పట్టుకునేందుకు మైదానమంతటా పరుగులు తీశారు.

స్టేడియంలో హై డ్రామా.. నెట్టింట వీడియోలు వైరల్: 
మ్యాచ్ 24వ నిమిషంలో సెనెగల్ ప్లేయర్ హబీబ్ దియారా కొట్టిన అద్భుతమైన గోల్ కారణంగా ఆ జట్టు 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 32వ నిమిషంలో బెల్జియం జట్టు బంతిని పాస్ చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ భద్రతా లోపం బయటపడింది. మైదానంలోకి దూసుకొచ్చిన వారిలో ఒక వ్యక్తి సెక్యూరిటీ సిబ్బందికి దొరకకుండా కాసేపు ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు సిబ్బంది అతనిని పట్టుకుని కిందకు నెట్టేయడంతో స్టేడియంలోని ప్రేక్షకులు నానా హంగామా చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఇంతమంది ఒకేసారి మైదానంలోకి ఎలా రాగలిగారంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

భద్రతపై పెరుగుతున్న ఆందోళన: 
సెక్యూరిటీ సిబ్బంది ఆ అపరిచిత వ్యక్తులను మైదానం బయటకి  పంపించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తర్వాత మ్యాచ్ మళ్లీ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగింది. కానీ, ఈ ఘటనతో ఫిఫా ప్రపంచకప్ స్టేడియాలలో కల్పిస్తున్న భద్రతా ప్రమాణాలపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టోర్నమెంట్‌లో రాబోయే మరిన్ని కీలక మ్యాచ్‌లలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఇంకా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.