వందేమాతరం వివాదంలో సోనియాగాంధీపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు వందేమాతర గీతాన్ని సోనియాగాంధీ అవమానించారని వెంటనే క్షమాపణ చెప్పాలని కర్నాటకలోని ఉర్వా పోలీస్ స్టేషన్ లో సోనియాగాంధీపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు ఫైల్ చేయనప్పటికీ వందేమాతరం కొత్త చట్టం ప్రకారం సోనియా గాంధీపై కేసు నమోదు చేయాలని బీజేపీనేతలు డిమాండ్ చేస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా వందనం సమయంలో వందేమాతర గీతాన్ని అవమానించారని బీజేపీ నేతలు ఆరోపిస్తు్న్నారు. వందే మాతరం పాడుతుండగా సోనియా, మల్లికార్జున్ ఖడ్గే మాట్లాడుతున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.. వారి ప్రవర్తన జాతీయ గీతాన్ని అగౌరవపర్చడమేనని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ విమర్శించారు.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కాంగ్రెస్ నేత సోనియాగాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వందేమాతరం గీతాన్ని అవమాన పర్చిందని, గీత రచయిత బంకిం చంద్ర చటోపాధ్యాయకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
వందేమాతర గీతాన్ని అవమానిస్తే కఠిన చర్యలు తీసుకునేలా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చిన సమయంలోనే ఈ వివాదం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
