వానలతో వాటర్ ​బోర్డుకు రిలీఫ్!.. హైదరాబాద్ లో వాటర్​ ట్యాంకర్లకు తగ్గిన డిమాండ్​

వానలతో వాటర్ ​బోర్డుకు రిలీఫ్!.. హైదరాబాద్ లో వాటర్​ ట్యాంకర్లకు తగ్గిన డిమాండ్​
  • గత ఏడాది మేలో12 వేల 
  • ట్యాంకర్ల బుకింగ్​
  • ఈసారి 25వరకు 8 వేలే...
  • రెండు రోజుల నుంచి 7 వేలకు పడిపోయిన డిమాండ్​

హైదరాబాద్​సిటీ, వెలుగు:గ్రేటర్​ పరిధిలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో నీటికి డిమాండ్​ తగ్గడంతో వాటర్​ బోర్డు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు నెలలతో పోలిస్తే ఈ పదిహేను రోజుల్లో వర్షాలతో ట్యాంకర్ల బుకింగ్​ సగానికి పడిపోవడంతో రిలాక్స్​ అవుతున్నారు. ఫిబ్రవరి నెల నుంచి మే నెల రెండోవారం నాటికి రోజుకు11 వేల నుంచి12వేల వరకు బుకింగ్స్​ వచ్చాయని, వర్షాలు మొదలుకావడంతో ఈ నెల 25 వరకు రోజు బుకింగ్స్ 8 వేలకు పడిపోయినట్టు చెప్పారు. గత రెండు రోజుల నుంచి అయితే, ఏడు వేలే ఉంటోందని చెప్తున్నారు.
 

వానలు పడక ముందు కష్టపడ్డాం

గత ఏడాది లెక్కనే ఈ ఏడాది మే రెండో వారం వరకు వాటర్​ట్యాంకర్లకు డిమాండ్​ఉండడంతో ప్లాన్​ప్రకారం నీటి ట్యాంకర్లను డెలివరీ చేసి సక్సెస్​అయ్యామని, రాత్రింబవళ్లు కష్టపడి ట్యాంకర్లను సరఫరా చేశామని వాటర్​బోర్డు అధికారులు చెప్తున్నారు. గత సంవత్సరం నీటి డిమాండ్​ను తట్టుకోవడంలో కొంత ఇబ్బందులు పడ్డామని, ఈసారి ఆ పరిస్థితి రిపీట్​కాకుండా యాక్షన్​ప్లాన్​తో ముందుకు వెళ్లామన్నారు. నీటి డిమాండ్​ను ముందే ఊహించి రోజుకు12వేల వరకు బుకింగ్​లు వచ్చినా తట్టుకునేలా అవసరమైన సిబ్బందిని నియమించామని, రోజుకు రెండు షిప్టుల్లో అంటే రాత్రి వేళల్లో కూడా ట్యాంకర్లను డెలివరీ చేశామన్నారు. ఇవి మంచి ఫలితాలు ఇచ్చాయని, ముందే వచ్చిన వర్షాలతో ఎండాకాలం ముగియకముందే నీటి కష్టాలు తప్పినట్టు చెప్తున్నారు.  

వెస్ట్​ సిటీలోనే అధిక సమస్య 

ముఖ్యంగా వెస్ట్​ సిటీలోని మాదాపూర్​, హైటెక్​సిటీ, నార్సింగి, కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, మియాపూర్​, కొండాపూర్, ఐటీకారిడార్​ వంటి ప్రాంతాల్లో భూగర్భజలాలు భారీగా పడిపోవడంతో బోర్లు ఎండిపోయాయి. గత ఏడాది నుంచి ఈ ప్రాంతాల్లో వేసవిలో తీవ్ర నీటి కొరత వస్తోందని అధికారులు ముందుగానే గుర్తించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. భారీగా వాటర్​ట్యాంకర్ల బుకింగ్​వచ్చినా ప్లాన్​ప్రకారం ట్యాంకర్లను డెలివరీ చేసి సమస్యలు రాకుండా నివారించగలిగారు.  

 రెట్టింపు ట్యాంకర్ల సరఫరా

గత ఏడాదితో పోలిస్తే ఈసారి రెట్టింపు ట్యాంకర్లను సరఫరా చేసినట్టు వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. 2024 జనవరి నుంచి మే నెల నాటికి రోజుకు 8 నుంచి 10 వేల ట్యాంకర్ల వరకూ బుకింగ్​లు జరిగితే..సరఫరా చేసేందుకు ఒక్కోసారి నాలుగు రోజుల నుంచి వారం వరకూ పట్టిందని అధికారులు తెలిపారు. కానీ, ఈసారి జనవరి నుంచి మే రెండో వారం నాటికి రోజుకు11వేల నుంచి12వేల ట్యాంకర్ల బుకింగ్​జరిగినా రెండు నుంచి మూడు రోజుల్లో డెలివరీ అయ్యేలా చూశామన్నారు. ప్రస్తుతం వర్షాలతో 24గంటల్లోనే సరఫరా చేసే పరిస్థితి ఉందన్నారు. 

రోజుకు 7 వేల బుకింగ్సే..

గత ఏడాది జనవరిలో 70వేల వరకు ట్యాంకర్లను సరఫరా చేస్తే ఈ ఏడాది దాదాపు లక్షా 30వేల ట్యాంకర్లను డెలివరీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఓవరాల్​గా గత సంవత్సరం వేసవి నాలుగు నెలల్లో యావరేజ్​కంటే ఈసారి రెట్టింపు ట్యాంకర్లు సరఫరా చేశామన్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ట్యాంకర్ల బుకింగ్​లు బాగా తగ్గినట్టు తెలిపారు. ఈనెల18వ తేదీన రోజుకు 9వేల వరకు బుకింగ్​లు ఉండగా, 21వ తేదీ నాటికి 8వేలకు చేరిందని, ఈనెల 25 నాటికి రోజుకు 7 వేలకు చేరిందన్నారు. ఇక ముందు మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.