
- గత ఏడాది మేలో12 వేల
- ట్యాంకర్ల బుకింగ్
- ఈసారి 25వరకు 8 వేలే...
- రెండు రోజుల నుంచి 7 వేలకు పడిపోయిన డిమాండ్
హైదరాబాద్సిటీ, వెలుగు:గ్రేటర్ పరిధిలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో నీటికి డిమాండ్ తగ్గడంతో వాటర్ బోర్డు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు నెలలతో పోలిస్తే ఈ పదిహేను రోజుల్లో వర్షాలతో ట్యాంకర్ల బుకింగ్ సగానికి పడిపోవడంతో రిలాక్స్ అవుతున్నారు. ఫిబ్రవరి నెల నుంచి మే నెల రెండోవారం నాటికి రోజుకు11 వేల నుంచి12వేల వరకు బుకింగ్స్ వచ్చాయని, వర్షాలు మొదలుకావడంతో ఈ నెల 25 వరకు రోజు బుకింగ్స్ 8 వేలకు పడిపోయినట్టు చెప్పారు. గత రెండు రోజుల నుంచి అయితే, ఏడు వేలే ఉంటోందని చెప్తున్నారు.
వానలు పడక ముందు కష్టపడ్డాం
గత ఏడాది లెక్కనే ఈ ఏడాది మే రెండో వారం వరకు వాటర్ట్యాంకర్లకు డిమాండ్ఉండడంతో ప్లాన్ప్రకారం నీటి ట్యాంకర్లను డెలివరీ చేసి సక్సెస్అయ్యామని, రాత్రింబవళ్లు కష్టపడి ట్యాంకర్లను సరఫరా చేశామని వాటర్బోర్డు అధికారులు చెప్తున్నారు. గత సంవత్సరం నీటి డిమాండ్ను తట్టుకోవడంలో కొంత ఇబ్బందులు పడ్డామని, ఈసారి ఆ పరిస్థితి రిపీట్కాకుండా యాక్షన్ప్లాన్తో ముందుకు వెళ్లామన్నారు. నీటి డిమాండ్ను ముందే ఊహించి రోజుకు12వేల వరకు బుకింగ్లు వచ్చినా తట్టుకునేలా అవసరమైన సిబ్బందిని నియమించామని, రోజుకు రెండు షిప్టుల్లో అంటే రాత్రి వేళల్లో కూడా ట్యాంకర్లను డెలివరీ చేశామన్నారు. ఇవి మంచి ఫలితాలు ఇచ్చాయని, ముందే వచ్చిన వర్షాలతో ఎండాకాలం ముగియకముందే నీటి కష్టాలు తప్పినట్టు చెప్తున్నారు.
వెస్ట్ సిటీలోనే అధిక సమస్య
ముఖ్యంగా వెస్ట్ సిటీలోని మాదాపూర్, హైటెక్సిటీ, నార్సింగి, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మియాపూర్, కొండాపూర్, ఐటీకారిడార్ వంటి ప్రాంతాల్లో భూగర్భజలాలు భారీగా పడిపోవడంతో బోర్లు ఎండిపోయాయి. గత ఏడాది నుంచి ఈ ప్రాంతాల్లో వేసవిలో తీవ్ర నీటి కొరత వస్తోందని అధికారులు ముందుగానే గుర్తించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. భారీగా వాటర్ట్యాంకర్ల బుకింగ్వచ్చినా ప్లాన్ప్రకారం ట్యాంకర్లను డెలివరీ చేసి సమస్యలు రాకుండా నివారించగలిగారు.
రెట్టింపు ట్యాంకర్ల సరఫరా
గత ఏడాదితో పోలిస్తే ఈసారి రెట్టింపు ట్యాంకర్లను సరఫరా చేసినట్టు వాటర్బోర్డు అధికారులు తెలిపారు. 2024 జనవరి నుంచి మే నెల నాటికి రోజుకు 8 నుంచి 10 వేల ట్యాంకర్ల వరకూ బుకింగ్లు జరిగితే..సరఫరా చేసేందుకు ఒక్కోసారి నాలుగు రోజుల నుంచి వారం వరకూ పట్టిందని అధికారులు తెలిపారు. కానీ, ఈసారి జనవరి నుంచి మే రెండో వారం నాటికి రోజుకు11వేల నుంచి12వేల ట్యాంకర్ల బుకింగ్జరిగినా రెండు నుంచి మూడు రోజుల్లో డెలివరీ అయ్యేలా చూశామన్నారు. ప్రస్తుతం వర్షాలతో 24గంటల్లోనే సరఫరా చేసే పరిస్థితి ఉందన్నారు.
రోజుకు 7 వేల బుకింగ్సే..
గత ఏడాది జనవరిలో 70వేల వరకు ట్యాంకర్లను సరఫరా చేస్తే ఈ ఏడాది దాదాపు లక్షా 30వేల ట్యాంకర్లను డెలివరీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఓవరాల్గా గత సంవత్సరం వేసవి నాలుగు నెలల్లో యావరేజ్కంటే ఈసారి రెట్టింపు ట్యాంకర్లు సరఫరా చేశామన్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ట్యాంకర్ల బుకింగ్లు బాగా తగ్గినట్టు తెలిపారు. ఈనెల18వ తేదీన రోజుకు 9వేల వరకు బుకింగ్లు ఉండగా, 21వ తేదీ నాటికి 8వేలకు చేరిందని, ఈనెల 25 నాటికి రోజుకు 7 వేలకు చేరిందన్నారు. ఇక ముందు మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.