
- 1912 నంబర్ వినియోగదారులందరికీ చేరాలి
- ఉత్తమ సేవలు అందించే సిబ్బందికి పురస్కారాలు
- విద్యుత్ అధికారుల రివ్యూ మీటింగ్లో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: రానున్న వేసవిలో డిమాండ్ సరిపడా విద్యుత్తును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఆయన డాక్టర్ సెక్రటేరియెట్లో సదరన్ డిస్కం(ఎస్పీడీసీఎల్) పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్తు డిమాండ్ ఉంటుంది.. అందుకు అధికారులు సిద్ధం చేసిన ప్రణాళికల వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అవసరాల మేరకు అధికారులు కోరిన అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో రానున్న వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని.. వినియోగదారులకు సైతం అవగాహన కల్పించాలి అన్నారు. విద్యుత్ శాఖలో లైన్మెన్ మొదలు విద్యుత్ శాఖ మంత్రి వరకు ఒక కుటుంబంలా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఏ సమస్య వచ్చినా వెంటనే పైఅధికారికి ఫోన్ చేయాలని వారు స్పందించని పక్షంలో ఆపై అధికారికి అలా నాకు కూడా ఫోన్ చేయవచ్చని సిబ్బందికి డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు.
మీకు క్షేత్రస్థాయిలో కావలసిన వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. హైదరాబాద్ సిటీలో ఎమర్జెన్సీ వాహనాల ద్వారా కొనసాగుతున్న విద్యుత్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాలని ఆదేశించారు. బాగా పని చేసే వారికి ప్రోత్సాహకంగా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని విద్యుత్ శాఖలో ప్రారంభించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
సమస్యల పరిష్కారానికి బిల్లులపై 1912 సేవలు ముద్రించండి
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన డయల్ 1912 నంబర్కు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రతి వినియోగదారునికి తెలిసేలా వారి మొబైల్ నెంబర్ కు 1912 ఎస్ఎంఎస్ చేయాలని, కరెంటు బిల్లు పైన సైతం 1912 సేవల గురించి ప్రచురించాలని ఆదేశించారు.
ఈ విభాగాన్ని పటిష్టం చేసేందుకు సిబ్బంది సంఖ్య పెంచడం, సాంకేతికంగా అదనపు హంగులు కల్పించేందుకు అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. స్టోర్స్ లో అందుబాటులో ఉన్న సామాగ్రి, రాబోయే రోజుల్లో డిమాండ్కు తగిన విధంగా చేసుకుంటున్న ఏర్పాట్లపై వివిధ విభాగాల్లో ఉన్న సీఈలతో ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం సమీక్ష చేశారు. సమావేశంలో సందీప్ కుమార్ సుల్తానియా, కృష్ణ భాస్కర్, ముషారఫ్ అలీ, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.