- డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ డిమాండ్
- హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన, వినతిపత్రం అందజేత
- వర్కింగ్ జర్నలిస్టులను విభజించొద్దని విజ్ఞప్తి
- డెస్క్ జర్నలిస్టులకూ పాత పద్ధతిలో అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేలా చూస్తాం: మంత్రి పొంగులేటి హామీ
హైదరాబాద్/ ఖమ్మం టౌన్, వెలుగు: అక్రెడిటేషన్లు, మీడియా కార్డుల పేరుతో వర్కింగ్ జర్నలిస్టులను విభజించొద్దని డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్టీ) నేతలు డిమాండ్ చేశారు. డెస్క్ జర్నలిస్టులకు పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం లక్డీకాపూల్లోని హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట యూనియన్ నేతలు నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమానికి వివిధ పత్రికలకు చెందిన డెస్క్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజయ్యారు. ఈ సందర్భంగా డీజేఎఫ్ టీ ప్రెసిడెంట్ బాదిని ఉపేందర్ , ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ.. డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు తీసేసి, మీడియా కార్డులు ఇవ్వడం సరికాదన్నారు.
ఇది జర్నలిస్టుల పట్ల వివక్ష చూపినట్లు అవుతుందని స్పష్టం చేశారు. రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు కలిస్తేనే జర్నలిజం అవుతుందని ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ లు చెప్పారు. మీడియా కార్డుల పేరుతో డెస్క్ జర్నలిస్టులను రెండో గ్రేడ్ వారిగా మర్చొద్దని చెప్పారు. అలాగే జీవో నంబర్ 252ను సవరించాలని, స్పో్ర్ట్స్, సినిమా, ఫీచర్స్, వెబ్, కల్చరల్, బిజినెస్, కార్టునిస్టులకు గతంలో లాగా అక్రెడిటేషన్ కార్డులివ్వాలని నేతలు డిమాండ్ చేశారు. అనంతరం హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ కదిరవన్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కేవీ రాజారామ్, డీజేఎఫ్టీ కోశాధికారి నిసార్, జాయింట్ సెక్రటరీ విజయ, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, రాష్ట్ర నాయకులు రాజశేఖర్, నవీన్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్, హెచ్యూజే, ఎస్జాట్ తదితర జర్నలిస్టు సంఘాలు పాల్గొని మద్దతు ప్రకటించాయి.
ఎవరూ ఆందోళన చెందొద్దు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
డెస్క్ జర్నలిస్టులకు గతంలోలాగే అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేలా చూస్తామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు, టీడబ్ల్యూజేఫ్ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ ఖదీర్, శ్రీనివాస్ రెడ్డి శనివారం మహబూబాబాద్లో మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు డెస్క్ జర్నలిస్టులకు సైతం అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. అలాగే డెస్క్ జర్నలిస్టుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి వినతులపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ డెస్క్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. వెంటనే అధికారులతో మాట్లాడతానని వెల్లడించారు.
జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీనిచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మంత్రిని కలిసిన వారిలో డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ)కమిటీ ఖమ్మం జిల్లా కన్వీనర్ కాంకూరి వెంకటేశ్వరరావు, కోకన్వీనర్లు కేతిరెడ్డి అచ్చిరెడ్డి, వంశీ, శాబాదు కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
