
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ ఇండియాకు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులను తొలగించాలని ఆదేశించింది. తొలగించిన ఎయిర్ ఇండియా అధికారుల్లో డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ చూరా సింగ్, చీఫ్ మేనేజర్ - డోప్స్, క్రూ షెడ్యూలింగ్ పింకీ మిట్టల్, క్రూ షెడ్యూలింగ్ - ప్లానింగ్ పాయల్ అరోరా ఉన్నారు.
క్రూ షెడ్యూలింగ్, లైసెన్సింగ్ నిబంధనల ఉల్లంఘన, పర్యవేక్షణలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన DGCA ఈ అధికారులను తొలగించాలని ఆదేశించింది. ఎయిర్ ఇండియా తన విమానయాన వ్యవస్థను మార్చిన తర్వాత నిర్వహించిన ఆడిట్లో ఈ లోపాలు బయటపడ్డాయి. DGCA సంబంధిత అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.
DGCA ఎయిర్లైన్ అకౌంటబుల్ మేనేజర్కు షో కాజ్ నోటీసు జారీ చేసింది. స్పాట్ చెక్లో విమాన డ్యూటీ షెడ్యూల్ నిబంధనల ఉల్లంఘించారని తెలిపింది. రెగ్యులేటర్ ప్రకారం.. ఆ అధికారి మే 16 ,17 తేదీల్లో బెంగళూరు నుండి లండన్కు (AI133) వరుసగా రెండు సుదూర విమానాలను నడిపారు. రెండూ అనుమతించబడిన విమాన సమయ పరిమితి 10 గంటలు మించిపోయాయి.ఈ ఉల్లంఘనకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఏడు రోజుల్లోపు వివరించాలని ఏవియేషన్ వాచ్డాగ్ ఆ అధికారిని కోరింది.
తొలగించబడిన ముగ్గురు అధికారులు విధుల్లో ఉండే సిబ్బంది లిస్టు, డ్యూటీ చార్ట్ ప్లాన్ చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పైలట్ పని గంటలు ,విశ్రాంతి సమయం, భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండేలా వీరు ప్లాన్ చేస్తారు. ఈ ఘటన బాధ్యులైన ఈ అధికారులందరిపై అంతర్గత క్రమశిక్షణా చర్యలు వెంటనే ప్రారంభించాలని ,ఈ చర్యల ఫలితాన్ని 10 రోజుల్లోపు నివేదించాలని DGCA ఆదేశించింది.
►ALSO READ | ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి తప్పు.. భారత్ మౌనం వీడాలి: సోనియా గాంధీ
మరోవైపు గుజరాత్ ప్రభుత్వం ప్రమాదంలో బాధితులను గుర్తించడానికి ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 220 DNA నమూనాలను పోల్చి చూశారు.160 మంది భారతీయులు, 34 మంది బ్రిటిష్ జాతీయులు. ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు , ఒక కెనడియన్ సహా 202 మంది బాధితుల అవశేషాలను వారి కుటుంబాలకు అప్పగించామని ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ శనివారం తెలిపారు.
ఈ ప్రమాదం భారత్ లో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటి. విమానం కూలిపోయిన తర్వాత దాని బ్లాక్ బాక్స్ (డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్) స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు అధికారులు. దీని ద్వారా ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.