
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం తీవ్ర స్థాయిలకు చేరుకుంది. ఇరాన్ లోని అణు కార్యక్రమాలకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లోనూ ఇజ్రాయెల్ వరుస దాడులతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయితే తాజాగా ఈ వివాదంపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ స్పందించారు.
ఇరాన్ పై ఇజ్రాయెల్ ఈనెల 13న దాడిచేయటం చట్టవిరుద్ధమని, అలాగే ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించటమేనని సోనియా అన్నారు. ఇరు దేశాల మధ్య కొనసాగిన డ్రోన్ దాడులు, క్షిపణి దాడులు చివరికి యుద్ధం దిశగా మధ్యప్రాచ్యంలో ప్రమాదకరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇరాన్ గడ్డపై జరిగిన ఈ బాంబు దాడులు, టార్గెట్ చేసి ఇరాన్ లో ప్రముఖుల హత్యలను కాంగ్రెస్ ఖండించింది.
గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడులు క్రూరమైనవిగా సోనియా అన్నారు. ఇరాన్-అమెరికా మధ్య సంబంధాలు పురోగమిస్తున్న క్రమంలో ఇజ్రాయెల్ దాడులు చేయటం జరిగింది. ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజలకు మధ్య 1995లో జరగాల్సిన శాంతి ఒప్పందాన్ని నెతన్యాహూ చేసిన పనులు అడ్డుకున్నాయనని సోనియా పేర్కొన్నారు. ఇదే క్రమంలో సోనియా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై కూడా తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం ట్రంప్ ఇరాక్ ప్రాంతంలో జరిగిన తప్పే మళ్లీ ఇరాన్ లో చేస్తున్నట్లు ఆమె అన్నారు.
►ALSO READ | ఇండియా పాక్ యుద్ధం ఆపా.. అయినా నాకు నోబెల్ శాంతి బహుమతి రాదు: ట్రంప్
ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలతో భారత్ కి మంచి సంబంధాలు ఉన్నందున భారత్ ఈ దాడులపై మౌనం వీడాలని సోనియా అభిప్రాయపడ్డారు. ఇటవీలి సంవత్సరాల్లో భారత్ ఇజ్రాయెల్ తో డిఫెన్స్, వాణిజ్య, ఇంటెలిజెన్స్ బంధాలను బలపరుచుకుంది. అలాగే చారిత్రాత్మకంగా ఇరాన్ ప్రజలతో ఇండియాకు బలమైన బంధం ఉందని సోనియా పేర్కొన్నారు. ఇరాన్ చిరకాల మిత్రుడని, 1994లో కశ్మీర్ అంశంలో భారతదేశానికి అండగా నిలిచిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న ఇరాన్ నేతలు భారతదేశానికి అండగా ఉన్న విషయాన్ని పేర్కొన్నారు.
గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 55వేల మంది ప్రాణాలు కోల్పోయారని.. అక్కడ అందకారం నెలకొందని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతం విషయంలో భారత్ దౌత్య పాత్రను పునరుద్ఘాటించాలని సోనియా కోరారు. భారత్ స్పష్టంగా మాట్లాడి, బాధ్యతాయుతంగా వ్యవహరించటం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలను ప్రోత్సహించాలని ఆమె సూచించారు. మోదీ సర్కార్ సూత్రప్రాయమైన నిబద్ధతను దాదాపుగా వదిలేసిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ ఆలస్యం కాలేదని ఆమె విజ్ఞప్తి చేశారు.