ఒక్కడిని చేసి 12 మంది కొట్టారు.. శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థిపై తోటి సీనియర్ల అమానుషం..

ఒక్కడిని చేసి 12 మంది కొట్టారు.. శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థిపై తోటి సీనియర్ల అమానుషం..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ లో దారుణం జరిగింది. స్థానిక శ్రీచైతన్య స్కూల్లో విద్యార్థిపై 12 మంది సీనియర్ స్టూడెంట్స్ అమానుషంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్  పరిధిలోని దమ్మాయిగూడ శ్రీచైతన్య హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థిపై కర్రలు, ప్లేట్లతో కొట్టి బూట్లతో ముఖంపై తొక్కి విచక్షణా రహితంగా దాడి చేశారు సీనియర్ విద్యార్థులు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తమ కుమారుడు మెట్ల మీద నుంచి కిందపడిపోయాడంటూ స్కూల్ యాజమాన్యం తమకు ఫోన్ చేసి చెప్పారని, వెంటనే వెళ్లి తమ కొడుకును ఇంటికి తీసుకొచ్చామని తెలిపిన బాలుడి తల్లిదండ్రులు.ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అభిషేక్.

తనపై ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు దాడి చేశారని అభిషేక్ చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. తమ కొడుకుపై దాడి చేసిన వారిపై, ఘటన బయటకు రాకుండా దాచిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అభిషేక్ తల్లిదండ్రులు.