రెడీ అవుతున్న సర్వే ఆఫ్ ఇండియా
రూ. 300 కోట్లు, రెండేళ్ల టైం
లోఆర్బిట్ శాటిలైట్లతో మ్యాప్లు
మన అవసరాలకు తగ్గట్టు వాడుకోవడానికే
గూగుల్ మ్యాప్స్ గురించి పరిచయం అక్కర్లేదు. భూమిపై ఏ ప్లేస్ ఎక్కడుందో వెతికి మన ముందు పెడుతుంది. తెలియని ప్రాంతం పేరును మ్యాప్లో టైప్ చేస్తే చాలు.. ఎంత దూరంలో ఉంది, ఎంత టైంలో వెళ్లొచ్చు, వెళ్లడానికి ఏయే రూట్లు ఉన్నాయో చెప్పేస్తుంది. కానీ ఆ శాటిలైట్ ఫొటోలతో కచ్చితమైన గ్రౌండ్ లెవల్ డేటా పొందలేం. విపత్తు సమయాల్లో, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడంలో, రోడ్లు వేయడంలో ఈ డేటా ఊపయోగపడదు. అందుకే మన సర్వే ఆఫ్ ఇండియా కొత్త డిజిటల్ మ్యాప్ను రెడీ చేస్తోంది. ‘మ్యాప్ ఇండియా మిషన్’ పేరుతో ప్రాజెక్టును లాంచ్ చేసింది. రూ.300 కోట్ల ఖర్చుతో రెండేళ్లలో కచ్చితమైన డిజిటల్ మ్యాపింగ్ను సిద్ధం చేయబోతోంది.
ప్రజలకు అందుబాటులో..
లో ఆర్బిట్ శాటిలైట్లతో మ్యాప్లను రెడీ చేస్తున్నామని, రోజువారి నావిగేషన్కు ఉపయోగపడినా ఇవి నిజమైన మ్యాప్లు మాత్రం కావని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ అశుతోష్ శర్మ చెప్పారు. పదేళ్ల క్రితం మ్యాపింగ్ కష్టమైన పనేనని, ఈ డిజిటల్ మ్యాపింగ్ను అప్పట్లో చేసుంటే రూ.4 వేల కోట్లు ఖర్చయ్యేదని, పదేళ్లు పట్టేదని వివరించారు. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి రూ.300 కోట్లతో రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, హర్యానాల్లో ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియా పని మొదలుపెట్టిందని చెప్పారు. టెండర్లు, థర్డ్ పార్టీతో దేశం మొత్తం డిజిటల్ మ్యాపింగ్ చేయబోతున్నామన్నారు. సర్వే ఆఫ్ ఇండియా చేసిన ప్రతి మ్యాప్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.
జార్జ్ ఎవరెస్ట్ టైంలో
దేశంలో 1830 తర్వాత ఇది రెండో అతి పెద్ద సర్వే మిషన్ అని శర్మ అన్నారు. ఇండియా సర్వేయర్ జనరల్గా బ్రిటిష్ జియోగ్రాఫర్ జార్జ్ ఎవరెస్ట్ పని చేసిన టైం (1830 నుంచి 1843)లో ఇండియాను మ్యాప్ చేశారని చెప్పారు.‘అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. టైగర్లు, దోమలు, విష జంతువులున్న అడవుల వెంబడి తిరిగి సర్వే చేయాల్సి వచ్చింది. దీంతో చాలా మంది సర్వేయర్లు చనిపోయారు. మ్యాపింగ్ పని చేస్తున్న టైంలో ఎవరెస్టుకూ మలేరియా పాకింది. ఇప్పుడు మనకు అద్భుతమైన టెక్నాలజీ ఉంది’ అని అన్నారు. మ్యాప్ ఇండియా మిషన్లో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. ఫస్ట్.. హై రిజొల్యూషన్ కెమెరాలున్న డ్రోన్లతో ప్రాంతాలను ఫొటోలు తీస్తారు. వాటి ఫీచర్లు, సముద్ర మట్టం నుంచి ఎత్తును అంచనా వేస్తారు. సెకండ్.. కంట్రోల్ పాయింట్స్ గుర్తించడం. సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటికే కంటిన్యూయస్లీ ఆపరేటెడ్ రిఫరెన్స్ సిస్టమ్ను రెడీ చేసింది. ఇది జియోగ్రాఫికల్ పాయింట్స్ నెట్వర్క్. దీని ద్వారా ప్రాంతం అక్షాంశాలు, రేఖాంశాలను కనుక్కోవచ్చు. ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఈ పాయింట్లను రిఫరెన్స్గా వాడుతున్నారు. ఈ పాయింట్ల దగ్గర ఇప్పుడు డిజిటల్ స్టిక్స్ ఏర్పాటు చేస్తారు. వాటి ద్వారా శాటిలైట్లతో సమాచారం ఇచ్చిపుచ్చుకుంటారు.
నమామి గంగను కూడా..
నమామి గంగను కూడా మ్యాపింగ్ చేస్తామని శర్మ చెప్పారు. గంగా పరివాహకం మొత్తాన్నీ కచ్చితంగా మ్యాప్ చేస్తామన్నారు. ఇందుకోసం గంగకు రెండు వైపులా 25 కిలోమీటర్ల మేర మనకు డేటా అవసరమని చెప్పారు. కలుషిత నీరు ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించడం కూడా సులువవుతుందన్నారు. నేల కొట్టుకుపోవడం ఎక్కడ ఎక్కువగా జరుగుతోందో కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. ‘ఎత్తుకు సంబంధించి కచ్చితమైన మ్యాప్లు మన దగ్గర ఉంటే ఎక్కడ వరద వస్తుందో ఈజీగా గుర్తించవచ్చు. వెంటనే అక్కడి వాళ్లను ఖాళీ చేయించవచ్చు. కొత్త ప్రాజెక్టులను గంగా పరివాహకంలో కట్టాల్సి వస్తే ఎక్కడైతే బాగుంటుంతో చెప్పొచ్చు’ అని శర్మ వివరించారు.

