- హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పైపైకి..రానున్న 12 నెలల్లో 15 శాతం పెరగొచ్చని నిపుణుల అంచనా
- వయసు, దీర్ఘకాలిక వ్యాధులు, సమ్ ఇన్సూర్డ్ బట్టి మరింత ఎక్కువ
- హాస్పిటల్స్ రూమ్, కన్సల్టెన్సీ, డయాగ్నోస్టిక్స్, ట్రీట్మెంట్ వంటి మెడికల్ ఖర్చులు పెరగడమే కారణం
- కరోనా సంక్షోభం తర్వాత పెరిగిన క్లెయిమ్స్..పడిపోతున్న కంపెనీల లాభాలు
- 2021-25 మధ్య 46 శాతం పెరిగిన ఫ్యామిలీ ఫ్లోటర్ ప్రీమియం
న్యూఢిల్లీ: హెల్త్ ఇన్సూరెన్స్ మరింత ఖరీదుగా మారనుంది. జీఎస్టీ తగ్గించడంతో తగ్గిన ప్రీమియం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. మెడికల్ ఖర్చులు పెరుగుతుండడంతో రానున్న 12–18 నెలల్లో 10–15శాతం వరకు ప్రీమియం రేట్లు పెరగొచ్చని ఇన్సూరెన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వయసు, దీర్ఘకాలిక వ్యాధులు, సమ్ ఇన్సూర్డ్ బట్టి ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అన్నారు.
హాస్పిటల్ రూమ్ ఛార్జీలు, డయాగ్నోస్టిక్స్ ఖర్చులు పెరగడం, ప్యాండమిక్ తర్వాత క్లెయిమ్స్ ఫ్రీక్వెన్సీ ఎక్కవవ్వడంతో ప్రీమియం రేట్లను పెంచాలని కంపెనీలు చూస్తున్నాయి. వీటికితోడు వృద్ధుల సంఖ్య పెరుగుతుండడం, కార్డియాక్, క్యాన్సర్ వంటి లైఫ్స్టైల్ వ్యాధులు, పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాల వల్ల ప్రైవేట్ హెల్త్కేర్పై ఆధారపడటం ఎక్కువైంది. మెడిసిన్ ఖర్చులు, అధునాతన చికిత్సలు, స్పెషలిస్ట్ ఫీజులు ఎక్కువయ్యాయి.
కరోనా తర్వాత నుంచి పెరుగుదల
కరోనా సంక్షోభం తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మెడికల్ ఖర్చులు పెరగడంతో పాటు డిమాండ్ పెరగడం కూడా ఇందుకు కారణం. ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు 2022–23, 2024–25 మధ్య 23 శాతం పెరిగాయని చాయిస్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రాజేంద్ర ఉపాధ్యాయ్ తెలిపారు. రాబోయే 2–-3 సంవత్సరాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ప్రతి ఏటా 10–-15శాతం పెరగొచ్చని అంచనా వేశారు. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ సగటు ధర 2021లో ఏడాదికి సుమారు రూ.15 వేలు ఉంటే, 2025లో రూ.22 వేలకి పెరిగిందని, ఇది సుమారు 46శాతం పెరుగుదల అని వివరించారు.
మెడికల్ ఇన్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) నేషనల్ లెవెల్లోని రిటైల్ ఇన్ఫ్లేషన్ కంటే చాలా ఎక్కువగా ఉందని, ధరలు పెరుగుదల ఏడాదికి 14–-15 శాతం ఉంటోందని అన్నారు. భారతదేశంలో మెడికల్ ఇన్ఫ్లేషన్ ఏడాదికి సుమారు 14శాతం ఉండటం ఆసియాలోనే అత్యధికం. ప్రోబస్లో లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సరితా జోషి మాట్లాడుతూ, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పటికే ప్రీమియంలను దశలవారీగా పెంచుతూ వస్తున్నాయని, రాబోయే 12–18 నెలల్లో మళ్లీ ధరల పెరుగుదల కనిపిస్తుందని చెప్పారు.
“సాధారణంగా 10–15శాతం పెరుగుదల మాట్లాడుతున్నాం. కానీ వయసు, ప్రాంతం, సమ్ ఇన్సూర్డ్, క్లెయిమ్స్ హిస్టరీ ఆధారంగా ధరలు ఇంకా ఎక్కువగా పెరగొచ్చు” అని ఆమె అన్నారు. సీనియర్ సిటిజన్లు, మెట్రో నగరాల్లోని పాలసీదారులకు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ రెన్యూవల్ సమయంలో పెరిగిన ప్రీమియం రేట్లు అమల్లోకి వస్తాయి.
ముఖ్యంగా ఫ్యామిలీ ఫ్లోటర్లు, సీనియర్ సిటిజన్ ప్లాన్లు, ఎక్కువ సమ్ ఇన్సూర్డ్ కవర్లు రాబోయే 6–12 నెలల్లో 10–15శాతం పెరుగుతాయని స్టే వెల్.హెల్త్ కో-ఫౌండర్ అరుణ్ రామమూర్తి అంచనా వేశారు. ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐబీఏఐ) ఎనలిస్ట్ హరి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, ప్రీమియం పెరుగుదల సమీప భవిష్యత్తులోనే కాకుండా దీర్ఘకాలంలో కూడా ఉంటుందని, వయసు పెరుగుదల వంటి కారణాలు కూడా దీనికి దోహదం చేస్తాయని అన్నారు.
పెరిగిన క్లెయిమ్స్
కరోనా సంక్షోభం తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ భారీగా పెరిగాయని శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ అండర్రైటింగ్ ఆఫీసర్ శశి కాంత్ దహుజా అన్నారు. ప్రజలు పూర్తిస్థాయి హెల్త్ కేర్ వైపు మారడం క్లెయిమ్స్ను పెంచాయని చెప్పారు. ఇటీవలి సంవత్సరాల్లో క్లెయిమ్స్ రేషియో 90శాతం దాటడంతో ఇన్సూరెన్స్ కంపెనీల లాభాలు తగ్గిపోతున్నాయి. దీంతో ధరలు పెంచాలని కంపెనీలు చూస్తున్నాయి.
కస్టమర్ల ఆలోచనలో మార్పు
ప్రీమియం పెరుగుదల వల్ల పాలసీదారుల ప్రవర్తన కూడా మారుతోంది. సీనియర్ సిటిజన్లు, మిడిల్ ఏజ్ వారిలో పాలసీ రెన్యూవల్స్ చేసుకోకపోవడం, కవరేజ్ తగ్గించడం (బయింగ్ డౌన్) వంటి ధోరణులు కనిపిస్తున్నాయి. మార్కెట్ గ్రోత్ కూడా కొత్త కస్టమర్ల కంటే ప్రీమియం పెరుగుదల వల్ల ఉంది. ప్రీమియం ధరలు పెరిగితే కస్టమర్లు తక్కువ సమ్ ఇన్సూర్డ్, ఎక్కువ మినహాయింపులు లేదా సింపుల్ ప్లాన్లు ఎంచుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
అయితే హెల్త్ రిస్కుల గురించి అవగాహన పెరగడం వల్ల రెన్యూవల్స్ గణనీయంగా తగ్గే అవకాశం లేదన్నారు. ప్రీమియంలు పెరిగితే కస్టమర్లు పాలసీ కొనుగోళ్లు ఆలస్యం చేయొచ్చు లేదా బేసిక్ పాలసీలు ఎంచుకోవచ్చని, కానీ తగిన కవరేజ్ అవసరం గురించి అవగాహన కూడా పెరుగుతోందని చెప్పారు.

