కోల్కతా: టెర్రరిస్టుల నుంచి దేశాన్ని రక్షించేందుకు బెంగాల్లో బీజేపీ గెలిచి తీరాలని, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులను బీజేపీలోకి చేర్చుకోవడంపై ఘోష్ స్పందించారు. కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇతర పార్టీల నుంచి చేరికలు అవసరమని స్పష్టం చేశారు.
బీజేపీ భావజాలం, ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ప్రజాదరణ పార్టీకి బలమని దిలీప్ ఘోష్ తెలిపారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ బెంగాలీ గడ్డపై పుట్టినవాడని.. ఇక్కడ గెలుపు బీజేపీకి కీలకమని పేర్కొన్నారు. దేశ భద్రత గెలుపుతో ముడిపడి ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు చాలాకాలం ఎదురుచూశామని, ఇక్కడ గెలుపు తమ లక్ష్యమని వివరించారు.