పూరీ రథయాత్రలో అపశ్రుతి 750 మంది భక్తులకు అస్వస్థత

పూరీ రథయాత్రలో అపశ్రుతి 750 మంది భక్తులకు అస్వస్థత

పూరీ: ఒడిశాలోని పూరీ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకున్నది. శుక్రవారం మొదలైన యాత్ర జగన్నాథ ఆలయం నుంచి గుండిచా టెంపుల్ వరకు సాగింది. అయితే, మొదటి రోజు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అధిక వేడి, విపరీతమైన రద్దీ కారణంగా చాలా మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. రథాలను తాళ్లతో లాగుతున్న సమయంలో  750 మంది భక్తులు వాంతులతో ఇబ్బందిపడగా.. వారిని వెంటనే దవాఖానాలకు తరలించి, చికిత్స అందించారు.

ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. వారికి ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నదని చెప్పారు. ఈ క్రమంలో అధికారులు ఎప్పటికప్పుడు భక్తులు ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. కాగా, శుక్రవారమే గుండిచా ఆలయానికి చేరుకోవాల్సిన రథాలు ఒకరోజు ఆలస్యంగా వెళ్లాయి. రథాల దగ్గర భక్తులు రద్దీ ఎక్కువయ్యిందని, ఇదే సమయంలో బలభద్రుడి రథం దారి తప్పిందని, అందుకే ఇబ్బందులు వచ్చాయని మంత్రి పృథ్వీరాజ్​ హరిచందన్​ తెలిపారు.

ఒకరిద్దరే అస్వస్థతకు గురయ్యారు: ఒడిశా మంత్రి 

పూరీ జగన్నాథ రథయాత్రలో వందలాది మంది అస్వస్థతకు గురైనట్లు వచ్చిన వార్తలపై ఒడిశా మంత్రి ముఖేశ్​మహాలింగ్ స్పందించారు. అధిక తేమ, రద్దీ కారణంగా ఒకరిద్దరు భక్తులు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.