మీ-సేవ సెంటర్ కు రావద్దు..బాధితుల ఖాతాల్లోకి ఆర్ధిక సాయం

మీ-సేవ సెంటర్ కు రావద్దు..బాధితుల ఖాతాల్లోకి ఆర్ధిక సాయం

హైదరాబాద్ నగరంలో వరద బాధితులెవరూ మీ-సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల వచ్చిన వరదల వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం అందించే ఆర్థికసాయాన్ని నేరుగా బాధితుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు  GHMC కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. బాధితుల వివరాలు గుర్తింపు పూర్తైన తర్వాత చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. వరద సాయం కోసం బాధితులెవరూ మీ-సేవ సెంటర్ల చుట్టూ తిరగొద్దని విజ్ఞప్తి చేశారు. GHMC టీమ్స్ క్షేత్రస్థాయిలో పర్యటించి సాయం అందని వారి వివరాలను సేకరిస్తాయని తెలిపారు. ప్రస్తుతం బాధితుల వివరాలు ఆధార్ నంబర్ సర్టిఫికేషన్ జరుగుతోందని చెప్పారు.

ముంపునకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తోంది. సాయం అందని వారు మీ సేవ కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్న ప్రభుత్వ సూచనలతో బాధితులు మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగారు. అయితే.. అదే సమయానికి గ్రేటర్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పంపిణీ నిలిపివేశారు. ఎన్నికల తర్వాత వరద సాయం పంపిణీ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

GHMC బృందాలు పరిశీలించి అకౌంట్లలో జమ చేస్తామని కమిషనర్ లోకేశ్ కుమార్ చెప్పినప్పటికీ… వరద బాధితులు మీ సేవ కేంద్రాల దగ్గరకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు. కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్, జీడిమెట్ల, సురారం ప్రాంతాల్లోని పలు మీ సేవ సెంటర్లలో రద్దీ ఏర్పడింది.