న్యూఢిల్లీ: అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించననున్న రామ మందిర పనులు ఈ నెల 5న జరిగే భూమి పూజతో మొదలవనున్నాయి. కరోనా వ్యాప్తి కారణంతోపాటు భద్రతా దృష్ట్యా ఈ ఈవెంట్కు పోలీసులు, అధికారులు పటిష్ట సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. అయోధ్య నగరంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది జమ కాకుండా నిబంధనలు జారీ చేశారు. టెంపుల్ టౌన్లో షాపులు మాత్రం తెరిచే ఉంటాయని స్పష్టమైంది. 45 ఏళ్ల కంటే తక్కువ వయస్సులో ఉండి కరోనా నెటిగిట్గా తేలిన పోలీసులను మాత్రమే ప్రధాన మంత్రి భద్రతా వలయంలో తీసుకున్నారు. సెక్యూరిటీ గురించి అయోధ్య రేంజ్ డీఐజీ దీపక్ కుమార్ పలు విషయాలు వెల్లడించారు.
‘అయోధ్యకు ప్రధాని రానున్న నేపథ్యంలో అన్ని ప్రోటోకాల్స్ను పాటిస్తున్నాం. కరోనా ప్రోటోకాల్ను కూడా ఫాలో అవుతున్నాం. కరోనా వారియర్స్ను కూడా నియమిస్తాం. వీఐపీ రూట్స్ను డ్రోన్స్తో నిత్యం పర్యవేక్షిస్తాం. అయోధ్యలో ప్రజల కదలికలపై ఎలాంటి ఆంక్షలు లేవు. కరోనా భయం నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని మేం కోరుతున్నాం. అయితే బయటి వాళ్లను మాత్రం సిటీలోని రానివ్వబోం’ అని దీపక్ కుమార్ చెప్పారు.
‘ఇన్నర్ సెక్యూరిటీ రింగ్ను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆఫీసర్స్ (ఎస్పీజీ) ఆఫీసర్స్ నిర్వహిస్తారు. అలాగే కరోనా నెగిటివ్గా తేలిన పోలీసు అధికారులను ఐసోలేషన్లో ఉంచుతున్నాం. వీరిని పీఎం క్లోజ్డ్ ఇన్నర్ సెక్యూరిటీ రింగ్లో ఉంచుతాం’ అని యూపీ డీజీపీ హితేశ్ చంద్ర అవస్తీ శుక్రవారం తెలిపారు. పోలీసులు అయోధ్యలో 12 చోట్ల రూట్ డైవర్షన్స్కూ ప్లాన్స్ చేశారు.

