V6 News

ఆస్పత్రిలో ఆపరేషన్ చేస్తూ.. చేస్తూ గుండెపోటుతో డాక్టర్ మృతి : నిర్మల్ జిల్లాలో ఊహించని ఘటన

ఆస్పత్రిలో ఆపరేషన్ చేస్తూ.. చేస్తూ గుండెపోటుతో డాక్టర్ మృతి : నిర్మల్ జిల్లాలో ఊహించని ఘటన

ఆకస్మిక గుండెపోటు మరణాలు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మనదేశంలో ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. వృద్దులు, పిల్లలు, యువకులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గుండెజబ్బులు వస్తున్నాయి. గడిచిన దశాబ్దాలలో  45 ఏళ్లు దాటితే గానీ గుండెపోటు అనే మాట వినపడేది కాదు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ 30-40 ఏళ్ల యువకులలో కూడా హఠాత్తుగా గుండె ఆగిపోవడం వంటి సంఘటన పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. వైద్యం చేసి ప్రాణాలు కాపాడే డాక్టర్లు కూడా ఆకస్మిక గుండెపోటుతో చనిపోతున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఓ డాక్టర్ పేషెంటుకు ఆపరేషన్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఘటన స్థానికంగా విషాదం నింపింది.

నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం చోటు చేసుకుంది.ఆపరేషన్ థియేటర్ లో ఓ పేషెంట్ కు ఆపరేషన్ చేస్తుండగా డాక్టర్ కు గుండె పోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్ జిల్లా భైంసాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.  నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సురేందర్, భైంసాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం (ఏప్రిల్ 23) మధ్యాహ్నం ఓ రోగికి ఆపరేషన్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలారు.గమనించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించి డాక్టర్‌ను హుటాహుటిన నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విధి నిర్వహణలో డాక్టర్ సురేందర్ ప్రాణాలు కోల్పోవడం వైద్యవర్గాలను కలచివేసింది. డాక్టర్ సురేందర్ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబంతోపాటు భైంసాలో తీవ్ర విషాదం నెలకొంది.