హిందువులు జరుపుకొనే ప్రతి పండుగకు.. ఆ పండుగకు పెట్టే నైవేద్యాల విషయంలో కచ్చితంగా ఆరోగ్య విషయాలు ఉంటాయి. ఆషాఢమాసం.. అంటే వర్షాకాలంలో తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ( జులై 25,శనివారం) ఈ పండుగ వచ్చింది. ఆ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటాడని పండితులు చెబుతున్నారు. ఆ రోజున స్వామివారిని విశేషంగా పూజించి.. పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి. తొలి ఏకాదశి రోజున పేలాల పిండినే ఎందుకు ప్రసాదంగా తినాలి.. దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటి.. దానిని ఎలా తయారు చేయాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
తొలి ఏకాదశి రోజున పేలాల పిండి తినడం వల్ల మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు.ఈ రోజున పేల పిండి తినడం వలన సంవత్సరం పొడవునా ఆరోగ్యంగా ఉండవచ్చని నమ్మకం. ఇది భవిష్యత్తులో వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుందని భావిస్తారు.
పేలాల పిండి ఎందుకు తినాలి?
తొలి ఏకాదశి వర్షాకాలంలో వస్తుంది. వాతావరణంలో మార్పులకు మన శరీరంలో ఆరోగ్యపరంగా అనేక మార్పులు జరుగుతాయి. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ( జులై 25) ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.
అంతే కాకుండా పితృదేవతలకు పేలాలు అంటే చాలా ఇష్టం.. ఆరోజు పితృదేవతలను స్మరించుకోవాలి. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత.
ALSO READ : తొలి ఏకాదశి( జులై25): చాలా శక్తిమంతమైన రోజు..
పేలాలపిండి ఎలా తయారుచేయాలి..
- మొదటగా ఓ కప్పు జొన్నలు లేదా మొక్కజొక్కలు తీసుకోవాలి. జొన్నలు తీసుకున్నట్లయితే వాటిని వేడి నీళ్లల్లో కొంచెం సేపు ఉడికించాలి.
- ఆ తర్వాత ఉడికించిన జొన్నలను కనీసం గంట నుంచి రెండు గంటలపాటు ఆరబెట్టుకోవాలి.
- జొన్నలు బాగా ఆరిన తర్వాత స్టవ్ వెలిగించి.. వాటిని పేలాలుగా మార్చుకోవాలి.
- పేలాలను ఓ మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
- అదే మిక్సీలో బెల్లం, కొబ్బరి ముక్కలు, ఐదు యాలుకలు వేసి మొత్తగా చేసుకోవాలి.
- ఆ తర్వాత కొంచెం పుట్నాలు వేసి మెత్తగా పిండి చేసుకోవాలి.
- జొన్న పేలాల పిండిలో పుట్నాల పిండితోపాటు బెల్లం, కొబ్బరి, యాలుకలతో చేసిన మిశ్రమాన్ని కలపుకుంటే.. ఘుమఘుమలాడే జొన్న పేలాల పిండి తయారు అవుతుంది.
- మొక్కజొన్న పేలాల పిండి కూడా ఇదే తరహాలో తయారు చేసుకోవాలి.
