Team India Schedule: ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను 1–0 తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుంది. రాబోయే వారం నుంచి టీమిండియా క్రీడా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత బిజీ షెడ్యూల్ను ఎదుర్కోబోతోంది. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా ఒకే క్యాలెండర్ నెలలో, కేవలం 17 రోజుల వ్యవధిలో (సెప్టెంబర్ 13 నుంచి 30 వరకు) నాలుగు వేర్వేరు అంతర్జాతీయ సిరీస్లలో భారత జట్టు తలపడనుంది. ఇది అభిమానులకు నాన్-స్టాప్ వినోదాన్ని పంచడంతో పాటు ఇండియన్ క్రికెట్లో సరికొత్త మైలురాయిగా నిలవనుంది.
ఆఫ్ఘనిస్తాన్తో టీ20లు.. జపాన్తో చారిత్రాత్మక మ్యాచ్:
ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 13న ఆఫ్ఘనిస్తాన్తో ప్రారంభమయ్యే 3 మ్యాచ్ల టీ20 సిరీస్తో షురూ కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 13, 15, 17 తేదీలలో ఈ పోరు కొనసాగనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే సెప్టెంబర్ 22వ తేదీన జపాన్ మెన్స్ జట్టుతో టీమిండియా ఏకైక టీ20 మ్యాచ్ ఆడనుంది. క్రికెట్ చరిత్రలోనే భారత జట్టు జపాన్తో అంతర్జాతీయ మ్యాచ్లో పోటీపడటం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం.
ఆసియా క్రీడల్లో స్వర్ణంపై కన్నేసిన భారత్:
సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు (Asian Games 2026) మెన్స్ క్రికెట్ ఈవెంట్లోనూ టీమిండియా తమ సత్తా చాటేందుకు రెడీ అయింది. ఈ టోర్నమెంట్లో సెప్టెంబర్ 24న ఆఫ్ఘనిస్తాన్-జపాన్ మ్యాచ్తో పోటీలు ప్రారంభం కాగా, పాయింట్ల ఆధారంగా నేరుగా అర్హత సాధించిన భారత జట్టు సెప్టెంబర్ 28వ తేదీన జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్తో తన ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ప్రారంభించనుంది.
ALSO READ : కోహ్లీ జాతకంలో రాజయోగం.. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
వెస్టిండీస్తో వన్డే, టీ20 ధమాకా.. సెప్టెంబర్ 27 నుంచి షురూ:
ఈ సిరీస్లు ఒకవైపు కొనసాగుతుండగానే, సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్తో 3 వన్డేలు, 5 టీ20ల సుదీర్ఘ సిరీస్ స్టార్ట్ కానుంది. మొదటి వన్డే సెప్టెంబర్ 27న, రెండో వన్డే సెప్టెంబర్ 30న జరగనుండగా, ఆఖరి వన్డే అక్టోబర్ 3న షెడ్యూల్ చేయబడింది. వన్డే సిరీస్ ముగిసిన వెంటనే ఇరు జట్ల మధ్య పొట్టి ఫార్మాట్ పోరు ప్రారంభమైవనుంది. ఇలా ఒకే నెలలో నాలుగు వేర్వేరు సిరీస్లలో పాల్గొంటూ బీసీసీఐ (BCCI) సృష్టించనున్న ఈ అరుదైన రికార్డ్ క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది.
