- వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఇవే పరిస్థితులు
- భారత్లో వర్షాలు, తాగునీరు, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం
- ఐక్యరాజ్యసమితి, డబ్ల్యూఎంఓ హెచ్చరిక
- ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచన
న్యూయార్క్: పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు తీవ్రమవుతున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) హెచ్చరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇది ఇలాగే కొనసాగే అవకాశాలు దాదాపు 100% ఉన్నాయని అంచనాలు సూచిస్తున్నాయని స్పష్టం చేసింది. తమ గ్లోబల్ నెట్వర్క్ మధ్య బలమైన ఏకాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ, ఎల్ నినో/లా నినా అప్డేట్ ఇంత స్పష్టంగా రావడం ఇదే మొదటిసారని ఆ సంస్థ తెలిపింది.
ఎల్ నినో తీవ్రమవడంతో ప్రపంచమంతా తీవ్ర వాతావరణ పరిస్థితులతో కూడిన డేంజర్ జోన్లోకి ఎంటర్ అవుతోందని హెచ్చరించింది. డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో ఈమేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘కరువులు, వరదలు సృష్టిస్తున్న విధ్వంసాన్ని ఇప్పటికే చూస్తున్నాం. ఎల్ నినో తీవ్రం అవుతున్న కొద్దీ ఈ ప్రభావాలు మరింత పెరుగుతాయి’ అని తెలిపారు.
చరిత్రలోనే ఈసారి ఎల్ నినో అత్యంత తీవ్రంగా ఉంటుందని అంచనా వేసిన సైంటిస్టులు దీనిని గాడ్జిల్లా ఎల్ నినోగా పిలుస్తున్నారు. ఇది వేగంగా బలపడుతోందని తాజాగా డబ్ల్యూఎంఓ వెల్లడించింది. దీనివల్ల వర్షపాతం, ఉష్ణోగ్రతలలో భారీ మార్పులు, వివిధ ప్రాంతాలలో విపరీతమైన వేడి, కరువు, వరదల ముప్పును పెంచుతుందని పేర్కొంది. సముద్ర ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నందున భూమి తీవ్ర వాతావరణ పరిస్థితుల ముప్పులో ఉందని యూఎన్ఎస్జీ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు.
వేగంగా బలపడుతున్న ఎల్ నినో
మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో అసాధారణంగా వెచ్చని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా ఎల్ నినో బలపడుతోంది. ప్రస్తుతం ఈ జలాలు వేడెక్కడం మరింత స్పష్టంగా కనిపిస్తోందని తాజా పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. ఎల్ నినోను పర్యవేక్షించడానికి ఉపయోగించే కీలకమైన నినో 3.4 సూచిక జులైలో సాధారణం కంటే దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. వీక్లీ రీడింగులు సగటు కంటే సుమారు 2.2 డిగ్రీల నుంచి 2.6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయి. ఎల్ నినో ఇది మరింత బలపడేందుకు దారి తీస్తోంది.
భారత్పై తీవ్ర ప్రభావం..
బలమైన ఎల్ నినో కారణంగా కొన్ని ప్రాంతాలు సుదీర్ఘకాలం పాటు పొడి వాతావరణాన్ని, కార్చిచ్చులు (వైల్డ్ఫైర్స్), నీటి భద్రతా ముప్పులను ఎదుర్కొంటే, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలను అనుభవించవచ్చు. రాబోయే నెలల్లో ప్రపంచంలోని అనేక భూభాగాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా. భారతదేశం విషయానికి వస్తే, బలపడుతున్న ఎల్ నినో నైరుతి రుతుపవనాలు, నీటి సరఫరా, వ్యవసాయంపై అదనపు ఒత్తిడిని తెస్తుంది. ఎల్ నినో చారిత్రాత్మకంగా బలహీనమైన లేదా అస్థిర రుతుపవనాల వర్షపాతంతో ముడిపడి ఉంది.
అక్టోబర్-–డిసెంబర్ కాలంలో ఇది మరింత బలపడవచ్చని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే భారత్లో ఆగస్టులో గణనీయమైన వర్షపాత లోటు నమోదుకాగా, సెప్టెంబర్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అయితే, ఎల్ నినో అన్ని ప్రాంతాలలో ఒకేలాంటి ప్రభావాలను చూపదు.
దీని ప్రభావం భౌగోళిక పరిస్థితులు, కాలం, అలాగే హిందూ, అట్లాంటిక్ మహాసముద్రాలలోని ఇతర వాతావరణ సరళులతో దాని పరస్పర చర్యలపై ఆధారపడి ఉంటుంది. కాగా, ఎల్ నినో కారణంగా తలెత్తుతున్న వాతావరణ ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు, రైతులు, ఆరోగ్య అధికారులు, నీటి వనరుల నిర్వహకులు, మానవతా సంస్థలు కాలానుగుణ అంచనాలను ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
