హైదరాబాద్ సిటీలో ర్యాపిడో బుక్ చేసుకుంటున్న మహిళలకు శుభవార్త. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో రాపిడో ‘పింక్ బైక్’ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. అంటే.. మహిళా కెప్టెన్లే బైక్ డ్రైవ్ చేస్తారు. కేవలం.. మహిళలు మాత్రమే ఈ బైక్స్, స్కూటీలు బుక్ చేసుకునే అవకాశం ఉంది.
ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ర్యాపిడో బుక్ చేసుకునే మహిళలకు, యువతులకు మరింత సౌకర్యవంతమైన రైడ్ ఉంటుందని ర్యాపిడో భావిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. బస్సులో మహిళలకు కేటాయించిన సీట్ల తరహాలో.. ర్యాపిడో పింక్ బైక్ మహిళల కోసం మాత్రమే.. మహిళా కెప్టెన్లు నడిపే బైక్స్, స్కూటీలు అందబాటులోకి వచ్చాయి.
ముఖ్యంగా ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా రాత్రిపూట ప్రయాణించాల్సిన అవసరం ఉన్న మహిళలకు ఈ ‘పింక్’ బైక్ సర్వీస్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాదు.. మహిళలకు అనువైన పని గంటలతో బైక్ కెప్టెన్లుగా పనిచేసే అవకాశాన్ని కూడా ఈ పింక్ బైక్ సర్వీస్తో ర్యాపిడో కల్పిస్తుంది. దీనికి నిర్దిష్ట లాగిన్ పరిమితులు ఏవీ లేవు. మహిళలు తమకు అందుబాటులో ఉన్న సమయంలో కెప్టెన్లుగా పనిచేసి డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది.
►ALSO READ | హైదరాబాద్ లో ఫేక్ నోట్ల ముఠా గుట్టు రట్టు.. వైన్ షాపులు, కూరగాయల మార్కెట్లే టార్గెట్...సోషల్ మీడియాలో రీల్స్..!
ఈ ప్లాట్ఫారమ్లో చేరే మహిళలు రెండు గంటల పనికి సుమారుగా ₹400, నాలుగు గంటల పనికి ₹800 సంపాదించవచ్చు. పింక్ బైక్ కెప్టెన్లుగా మారడానికి ఆసక్తి ఉన్న మహిళలు ర్యాపిడో కెప్టెన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని, ప్లాట్ఫారమ్ ద్వారా నమోదు చేసుకోవచ్చని ర్యాపిడో తెలిపింది.
