జంతర్ మంతర్‎లో మళ్లీ ఉద్రిక్తత.. సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్

జంతర్ మంతర్‎లో మళ్లీ ఉద్రిక్తత.. సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్

ఢిల్లీలోని జంతర్ మంతర్‎లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. జంతర్ మంతర్ ప్రాంతంలో ఇంటర్నెట్‎పై ఆంక్షల విషయంలో పోలీసులు, సీజేపీ నిరసనకారుల మధ్య తీవ్ర వాగాద్వం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొందరు నిరసనకారులు పోలీసులను లక్ష్యంగా చేసుకుని రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతంగా మారింది. 

దీంతో పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసులపై ఎదురు దాడి చేశారు. దీంతో పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అదనపు బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఈ పరిణామాలతో జంతర్ మంతర్‎లో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు.. సీజేపీ నిరసనలతో ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, సోషల్ మీడియా ద్వారా ఆకతాయిలు పుకార్లు వ్యాప్తి చేయకుండా ఉండేందుకు జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా పోలీసుల, భద్రతా బలగాల అదుపులో ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

జంత్ మంతర్‎లో ఇంటర్నెట్ బంద్

నీట్ 2026 పేపర్ లీక్‎కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వరుస ఆందోళనలతో గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్, దాని పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడతాయని తెలిపారు.

జంతర్ మంతర్‎లో వరుస ఆందోళనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు.. నీట్ పేపర్ లీక్‎కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జంతర్ మంతర్ ప్రాంతంలో పోలీసులు  భద్రతను కట్టుదిట్టం చేశారు. 

జంతర్ మంతర్ ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని భారీగా బలగాలను మోహరించారు. జంతర్ మంతర్‎లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శాంతియుతంగా చేస్తోన్న విద్యార్థుల నిరసనను అణగదొక్కేందుకు మోడీ సర్కార్ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. 


►ALSO READ | వరుస నిరసనలతో ఢిల్లీ షేక్.. జంతర్ మంతర్‎లో ఇంటర్‎నెట్ బంద్