జిలేబీ అనగానే జనాలకు నోట్లో నీళ్లు ఊరతాయి. తియ్య తియ్యగా.. వేడి వేడిగా.. కరకరలాడుతూ ఉంటాయి. జిలేబీలను సాధారణంగా మైదా పిండితో తయారు చేస్తారు. కాని వెరైటీగా బంగాళదుంప జిలేబీ ఎప్పుడైనా ట్రై చేశారా... చాలా స్వీట్ గా కరకరలాడుతూ ఉంది. రుచి అదిరిపోవాల్సిందే.. మరి అంత టేస్టీగా ఉండే పొటాటో జిలేబీ ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .!
ఆలూ జిలేబీ తయారీకి కావలసిన పదార్దాలు
మైదా పిండి - 100 గ్రాములు
బంగాళదుంపలు - 2 ( ఉడికించినవి)
పెరుగు - అర కప్పు
ఫ్రూట్ సాల్ట్ (ఈనో) - పావు టీస్పూన్
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
కుంకుమపువ్వు - చిటికెడు
యాలకుల పొడి - పావు టీస్పూన్
పంచదార - 1 కప్పు
పొటాటో జిలేబీ తయారీ విధానం
ముందుగా వెడల్పాటి గిన్నెను స్టవ్ పై పెట్టి వెలిగించాలి. ఆ గిన్నెలో పంచదార వేసి పాకం వచ్చేందుకు నీళ్లుపోసి మరిగించాలి. మంచి రుచి.. వాసనకు మరుగుతున్నప్పుడు అందులో యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేయాలి. ఓ ఐదు నిమిషాలపాటు అంటే తీగ పాకంలా.. జిగురులా వచ్చేలా మరిగించాలి. జిలేబీకీ పాకం మరీ చిక్కగా ఉండకూడదు. ఇలా తయరైన తరువాత స్టవ్ ను ఆపేయాలి.
ఇప్పుడు పెద్ద బౌల్ లో ఉడికించిన బంగాళదుంపలను మెత్తగా చేయాలి. మెత్తగా అయిన ఈ మిశ్రమంలో మైదా పిండి, పెరుగు, ఫ్రైట్ సాల్ట్ వేసి నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు. అలాగని మరీ పల్చగా కూడా ఉండకూడు. జిలేబీలు తయారు చేసేందుకు వీలుగా ఉండేలా మధ్యస్థంగా ఉండేలా బాగా కలుపుకోవాలి.
పిండి రడీ అయిన తరువాత మళ్లీ స్టవ్ వెలిగించి కళాయిలో నూనె పోసి వేడిచేయాలి. ఇప్పుడు ఒక శుభ్రమైన పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని అందులో కొద్దిగా( జిలేబీ సైజుకు సరిడడా) పిండిని తీసుకొని గుండ్రంగా చేసి పైన పట్టుకోవాలి. అడుగున చిన్న రంధ్రం చేయాలి. నూనె వేడెక్కిన తరువాత పిండిని గుండ్రంగా తిప్పుతూ జిలేబీ ఆకారంలో నూనెలో వేగించాలి. ఇవి రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేలా మీడియం ఫ్రేమ్ పై వేయించాలి.
ఇప్పుడు ఈ జిలేబీలను ముందుగా తయారు చేసుకున్న పాకం ఉన్న గిన్నెలో వేసి రెండు మూడు నిమిషాల పాటు నానపెట్టాలి. ఇప్పుడు ఈ జిలేబీలు పాకాన్ని బాగా పీల్చుకొని చాలా అందంగా తయారవుతాయి.
అంతే జ్యూసీగా.. టేస్టీగా ఉండే బంగాళదుంపల జిలేబీ రడీ.. వీటిని పిల్లలే కాదు.. పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు బంగాళదుంపల జిలేబీని ట్రై చేయండి.. మీరు జీవితాంతం గుర్తిండిపోతారు.
