హైదరాబాద్ : ఓ వైపు బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుండగా.. తాజాగా హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా అరెస్ట్ అయింది. బోయిన్ పల్లి, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో తమకు తెలిసిన వ్యక్తులకు డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. 155 గ్రాముల నిషేధిత హషీస్ ఆయిల్ ను కలిగి ఉన్న ఐదుగురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వ్యక్తులు డ్రగ్స్ కు బానిస అయినట్లు తెలిపారు. క్రమం తప్పకుండా గంజాయితో పాటు హషీస్ ఆయిల్ను సేవిస్తున్నారని తెలిపారు పోలీసులు.
అంతే కాకుండా హషీస్ ఆయిల్ను బోయిన్పల్లి, మల్కాజ్గిరి ఏరియాల్లో తమకు తెలిసిన వ్యక్తులకు విక్రయిస్తున్నారు. సాయి రెడ్డి, విక్రమ్ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి ఈ ఐదుగురు హషీస్ ఆయిల్ను కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు పోలీసులు. అయితే సాయి రెడ్డి, విక్రమ్ పరారీలో ఉన్నారని.. అరకు ఏజెన్సీ ప్రాంతాల నుంచి 5 గ్రాముల హషీస్ ఆయిల్ను రూ. 1500 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు.