దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 55.52 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు TRS ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు…. తన స్వగ్రామమైన బొప్పాపూర్ లో ఓటు వేశారు. తోగుట మండలం తుక్కపూర్ గ్రామంలో ఓటు వేశారు కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు నేతలు. అటు పలు సెంటర్స్ లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు నేతలు.
దుబ్బాకలో పోలింగ్ జరుతున్న తీరును పరిశీలిస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారి… కలెక్టర్ భారతి హోళీకేరి. ప్రతి ఒక్కరు ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ… మాస్కులు పెట్టుకొని ఓట్లు వెయాలన్నారు. నార్సింగ్ పోలింగ్ బూత్ లో అధికారులు ఫోన్లు తీసుకురావటంపై సీరియస్ అయ్యారు కలెక్టర్. మరోవైపు సీపీ జోయల్ కూడా పోలింగ్ బూత్ ల దగ్గర భద్రతను పరిశీలించారు. నాన్ లోకల్స్ ఉంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
పలు చోట్ల EVMలు మోరాయించటంతో… పోలింగ్ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. మరోవైపు కరోనా నేపధ్యంలో స్లోగా ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఓటు వేసేందుకు క్యూ లైన్లో వేచి చూస్తున్నారు జనం. ఒక్కో ఓటర్ కు దాదాపు 15 నిమిషాల టైం పడుతుందంటున్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఓటర్లు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్…. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. నియోజకవర్గంలోని మొత్తం 7 మండలాల్లోని 148 గ్రామాల్లో 315 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. నియోజకవర్గంలో మొత్తం లక్షా 98 వేల 807 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీరిలో లక్షా 778 మంది మహిళా ఓటర్లుండగా… 97 వేల 978 మంది పురుష ఓటర్లున్నారు. వీళ్లుకాక మరో 51 మంది సర్వీస్ ఓటర్లున్నారు.