మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న ఆయన తనకు కొన్ని సదుపాయాలు కల్పించాలని కోర్టును కోరారు. ఈ సందర్భంగా తనకు ఇంటి భోజనం కావాలని న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టు మాత్రం మాజీ మంత్రికి షాక్ ఇచ్చింది. ‘ ముందు జైలు కూడు తినండి. ఒక వేళ తినలేకపోతే అప్పుడు చూద్దాం’ అంటూ జడ్జి పేర్కొన్నారు . అయితే తన వయసు 71 ఏళ్లు కావడంతో జైలులో తనకు ప్రత్యేకమైన బెడ్ కావాలని కోరడంతో కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది.
ఈనెల 1న మనీ ల్యాండరింగ్ కేసులో అనిల్ దేశ్ముఖ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ముంబయి కార్యాలయంలో 12 గంటలపైనే ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని నిర్దేశించినట్టు ఆరోపణలు రావడంతో అనిల్ దేశ్ముఖ్ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సచిన్ వాజేను అనిల్ దేశ్ముఖ్ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు మహారాష్ట్రను కుదిపేశాయి. దీంతో అనిల్ దేశ్ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అనిల్ దేశ్ముఖ్పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అనిల్ దేశ్ముఖ్పై ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారి పరంబీర్ సింగ్పై కూడా లుక్ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆయనపై కూడా పలు ఆరోపణలు రావడంతో కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం పరంబీర్ పరారీలో ఉన్నారు.