న్యూఢిల్లీ: అమెజాన్–ఫ్యూచర్ గ్రూప్ గొడవకు సంబంధించిన డాక్యుమెంట్లను, ఆధారాలను మరోసారి వెరిఫై చేయడానికి అమెజాన్ ఇండియా మేనేజ్మెంట్ను, ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు అందుకున్న వారిలో అమెజాన్ కంట్రీ హెడ్ (ఇండియా) అమిత్ అగర్వాల్ కూడా ఉన్నారు. ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్సీపీఎల్) లో రూ. 1,431 కోట్లను 2019 లో అమెజాన్ ఇన్వెస్ట్ చేసింది. ఆ టైమ్లో కంపెనీ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) రూల్స్ను ఉల్లంఘించిందా? అనే అంశాలను ఈడీ పరిశీలించనుంది. ఫారిన్ ఎక్స్చేంజిలకు సంబంధించిన వివాదాలను ఫెమా చూసుకుంటోంది.
‘ఈ గొడవపై దర్యాప్తు చేసేందుకు ఈడీకి అమెజాన్ సహాకారం అందించాల్సి ఉంటుంది. తమ పర్సనల్ ఫైనాన్షియల్ డిటెయిల్స్తో పాటు, ఇతర డాక్యుమెంట్లను తీసుకురావాలని ఇరు కంపెనీలను ఈడీ కోరింది’ అని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ‘ఈడీ సమన్లను అందుకున్నాం. వీటిని పరిశీలించాక, ఇచ్చిన టైమ్లో రెస్పాండ్ అవుతాం’ అని అమెజాన్ స్పోక్స్ పర్సన్ తెలిపారు. ఈడీ సమన్లకు సంబంధించి ఫ్యూచర్ గ్రూప్ స్పందించలేదు. కాగా, ఎఫ్సీపీఎల్లో అమెజాన్కు 49 శాతం వాటా ఉంది. బిగ్బజార్, ఫుడ్ బజార్, ఈజీడే చెయిన్స్ వంటి స్టోర్లను ఆపరేట్ చేస్తున్న ఫ్యూచర్ రిటెయిల్లో ఎఫ్సీపీఎల్కు 10 శాతం వాటా ఉంటుంది. ఫ్యూచర్ కూపన్స్లో 49 శాతం వాటా ఉంది కాబట్టి, ఫ్యూచర్ రిటైల్లో కంట్రోలింగ్ రైట్స్ కూడా తమకు దక్కుతాయని వివిధ న్యాయస్థానాల్లో అమెజాన్ చెప్పుకొస్తోంది. కంపెనీకి ఈ రైట్స్ దక్కుతాయని ఈ ఏడాది ప్రారంభంలో ఢిలీ హైకోర్టు కూడా అంగీకరించింది.