
న్యూఢిల్లీ: చాలా కాలంగా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలపై ఎలక్షన్ కమిషన్ (ఈసీ) కొరడా ఝుళిపించింది. రాజకీయ పార్టీగా నమోదై 2019 నుంచి గత ఆరేండ్లలో ఏ ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని 345 రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ (ఆర్యూపీపీ)ను గుర్తించి డీలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈ జాబితాలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పలు రాజకీయ పార్టీలు ఉన్నాయని ఈసీ వెల్లడించింది. ఆయా పార్టీల ఆఫీసులు ఎక్కడా లేవని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా 2,800కు పైగా గుర్తింపులేని పొలిటికల్ పార్టీలుగా ఈసీ వద్ద నమోదై ఉన్నాయి. ఇందులో చాలా పార్టీలు రాజకీయ పార్టీగా కొనసాగడానికి కావాల్సిన షరతులను నెరవేర్చడంలో విఫలమయ్యాయని కమిషన్ గుర్తించింది. దీంతో వాటిపై చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైంది.