
న్యూఢిల్లీ: మన దేశంలో విధించిన ఎమర్జెన్సీ(1975)పై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబం తన అధికారాన్ని కాపాడుకోవడానికే దేశంలో ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు.
'ఎమర్జెన్సీ'టైంలో 'కిస్సా కుర్సి కా' అనే పొలిటికల్ సెటేరికల్ సినిమాను కూడా నిషేధించారని వెల్లడించారు. దేశంలో 'ఎమర్జెన్సీ' ప్రకటించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా.. శుక్రవారం ఆయన ఢిల్లీలో భారతీయ జనతా యువ మోర్చా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.."ఎమర్జెన్సీ టైంలో 'కిస్సా కుర్సి కా' అనే సినిమాను బ్యాన్ చేశారు.
ఇది ఒక రాజకీయ వ్యంగ్య చిత్రం. ఇందులో రాజ్ బబ్బర్, షబానా అజ్మీ నటించారు. ఇందిర, ఆమె కొడుకు సంజయ్ గాంధీలను ఉద్దేశించి సెటేరికల్ గా నిర్మించారు. 'కిస్సా కుర్సి కా' అనే మూడు పదాలు.. ఎమర్జెన్సీ విధించడానికి కారణాన్ని సంక్షిప్తంగా చెబుతాయి. ఒక కుటుంబాన్ని దేశం కంటే గొప్పగా పరిగణిస్తే ఎమర్జెన్సీ వంటి ఘటనలు జరుగుతాయి" అని వ్యాఖ్యానించారు.