ENG vs IND 2025: ఐదు సెంచరీలు వృధా.. తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై ఓడిన టీమిండియా

ENG vs IND 2025: ఐదు సెంచరీలు వృధా.. తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై ఓడిన టీమిండియా

లీడ్స్ వేదికగా హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ పై టీమిండియా ఓడిపోయింది. భారీ స్కోర్ ఇంగ్లాండ్ ముందు నిర్ధేశించి చివరి వరకూ పోరాడినా గిల్ సేనకు విజయం దక్కలేదు. మంగళవారం (జూన్ 24) ముగిసిన ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మరోవైపు ఇంగ్లాండ్ ఛేజింగ్ లో ఎలాంటి తడబాటు లేకుండా భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసి తొలి టెస్టులో విజయాన్ని ఖరారు చేసుకుంది. డకెట్ (149) భారీ సెంచరీకి తోడు క్రాలీ (65) రూట్ (53) హాఫ్ సెంచరీలు చేసి ఇంగ్లాండ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 

ఈ విజయంతో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ జూలై 2 న ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఇండియా 364 పరుగులకు ఆలౌటైంది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసి గెలిచింది.  

వికెట్ నష్టానికి 21 పరుగులతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ కు ఓపెనర్లు జోరు సూపర్ స్టార్ట్ ఇచ్చారు.  ఐదో రోజు ఆటలో భాగంగా తొలి సెషన్ లో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఓపెనర్లు బెన్ డకెట్, క్రాలీ ధాటికి టెస్ట్ ఇంగ్లాండ్ వైపుకు మొగ్గింది. ఐదో రోజు లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది. వికెట్ నష్టపోకుండా 117 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన ఇంగ్లాండ్ వేగంగా ఆడింది. ఓపెనర్లిద్దరూ బ్యాట్ ఝుళిపించడంతో స్కోర్ బోర్డు శరవేగంగా ముందుకు కదిలింది. ఈ క్రమంలో డకెట్ సెంచరీ పూర్తి చేసుకోగా.. క్రాలీ (59) హాఫ్ సెంచరీతో అతనికి చక్కని సహకారం అందించాడు. 

ALSO READ | ENG vs IND 2025: నాలుగేళ్ళ తర్వాత రీ ఎంట్రీ.. ఇండియాతో రెండో టెస్టుకు ఇంగ్లాండ్ స్టార్ బౌలర్

రెండో సెషన్ లో వర్షం సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళ్తుంది. వర్షం తగ్గిన తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో క్రాలీ 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ప్రసిద్ వేసిన ఔట్ స్వింగ్ కు స్లిప్ లో రాహుల్ కు క్రాలీ దొరికిపోయాడు. ఇదే ఊపులో ప్రసిద్ పోప్ ను బౌల్డ్ చేసి భారత్ కు రెండో వికెట్ అందించాడు. వరుసగా రెండు వికెట్లు పడినప్పటికీ ఇంగ్లాండ్ జోరు తగ్గలేదు. 

రూట్, డకెట్ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా డకెట్ బౌండరీలతో విరుచుకుపడితే.. రూట్ చక్కని సహకారం అందించాడు. మ్యాచ్ చేజారుతుందనుకున్న సమయంలో శార్దూల్ ఠాకూర్ మ్యాజిక్ చేశాడు. వరుస బంతుల్లో సెంచరీ హీరో డకెట్ తో పాటు బ్రూక్ ను డకౌట్ చేశాడు. ఈ దశలో ఇంగ్లాండ్ జట్టును సీనియర్లు రూట్ స్టోక్స్ ఆదుకున్నారు. ఐదో వికెట్ కు 49 పరుగులు జోడించి గెలుపు దగ్గరకు మ్యాచ్ ను తీసుకు వచ్చారు. చివర్లో రూట్, జెమీ స్మిత్ జాగ్రత్తగా ఆడుతూ ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించారు.