
ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ళ తర్వాత టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. బొటన వేలి గాయం నుంచి కోలుకొని ఫస్ట్-క్లాస్ క్రికెట్లో మ్యాచ్ ఆడాడు. చెస్టర్-లె-స్ట్రీట్లో జరిగిన కౌంటీ ఛాంపియన్షిప్ లో భాగంగా డర్హామ్తో జరిగిన మ్యాచ్లో ససెక్స్ తరపున ఈ స్పీడ్స్టర్ 14 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మే 2021 తర్వాత ఆర్చర్ తన తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడడం విశేషం. ఈ మ్యాచ్ లో ఇబ్బందిపడకుండా బౌలింగ్ చేసిన ఈ ఇంగ్లాండ్ పేసర్.. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. ఈ స్పెల్ తో తాను రెండో టెస్టుకు రెడీ అని సంకేతాలు ఇచ్చాడు.
బార్బడోస్కు చెంది ఆర్చర్ ఇంగ్లాండ్ దేశానికి ఆడుతున్నాడు. ఆర్చర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ను 2021 ఫిబ్రవరిలో ఆడాడు. ఆ తర్వాత మోచేయికి శస్త్రచికిత్స చేపించుకొని సుదీర్ఘ ఫార్మాట్ కు దూరమయ్యాడు. ఈ క్రమంలో 2023 లో జరిగిన యాషెస్ తో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. జూలై 2న ఎడ్జ్బాస్టన్లో భారత్తో ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఆర్చర్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో అనుభవం లేని ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఆర్చర్ జట్టులోకి వస్తే ఇంగ్లాండ్ బౌలింగ్ సమస్యలు తీరినట్టే.
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్చర్.. గాయాల కారణంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్కు దూరమై నాలుగేళ్లు అవుతోంది. మోచేతి, వెన్ను నొప్పి పదే పదే రావడంతో ఆర్చర్ 2021 నుంచి ఇంగ్లండ్ తరఫున వైట్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడాడు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్ తరఫున రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సి ఉన్నా.. బొటన వేలి గాయం తగ్గకపోవడంతో బరిలోకి దిగలేదు.