
ఏకపక్షంగా మారుతుందనుకున్న లీడ్స్ టెస్ట్ ఆసక్తికరంగా మారింది. వర్షం తర్వాత సెకండ్ సెషన్ లో టీమిండియా బౌలర్లు జోరు చూపించడంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. ఐదో రోజు టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. క్రీజ్ లో రూట్ (14), స్టోక్స్ (13) ఉన్నారు. ఇంగ్లాండ్ ఈ టెస్టులో గెలవాలంటే చివరి సెషన్ లో 102 పరుగులు చేయాలి. మరోవైపు ఇండియా విజయానికి 6 వికెట్ల దూరంలో నిలిచింది.
రెండో సెషన్ లో వర్షం సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళ్తుంది. వర్షం తగ్గిన తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు. ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో క్రాలీ 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ప్రసిద్ వేసిన ఔట్ స్వింగ్ కు స్లిప్ లో రాహుల్ కు క్రాలీ దొరికిపోయాడు. ఇదే ఊపులో ప్రసిద్ పోప్ ను బౌల్డ్ చేసి భారత్ కు రెండో వికెట్ అందించాడు. వరుసగా రెండు వికెట్లు పడినప్పటికీ ఇంగ్లాండ్ జోరు తగ్గలేదు.
రూట్, డకెట్ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా డకెట్ బౌండరీలతో విరుచుకుపడితే.. రూట్ చక్కని సహకారం అందించాడు. మ్యాచ్ చేజారుతుందనుకున్న సమయంలో శార్దూల్ ఠాకూర్ మ్యాజిక్ చేశాడు. వరుస బంతుల్లో సెంచరీ హీరో డకెట్ తో పాటు బ్రూక్ ను డకౌట్ చేశాడు. దీంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతుంది. శార్దూల్ ఠాకూర్,ప్రసిద్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ 364 పరుగులకు ఆలౌటైంది. మరోవైపు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 465 పరుగులకు ఆలౌటైంది.
WHAT. A. TEST!
— ESPNcricinfo (@ESPNcricinfo) June 24, 2025
🔗 https://t.co/ShJazRf4lJ pic.twitter.com/nlzN3Bxn0c