న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) తన ఆరోగ్య బీమా స్కీము ఈఎస్ఐని ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) స్కీము 443 జిల్లాల్లో పూర్తిగా, 153 జిల్లాల్లో పాక్షికంగా అమలు అవుతోంది. మిగతా148 జిల్లాలు ఈఎస్ఐ స్కీము పరిధిలోకి రావడం లేదు. ఇక నుంచి అన్ని జిల్లాల్లో ఈఎస్ఐని అమలు చేయాలని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన 188 వ సమావేశంలో నిర్ణయించారు.
ఎంఐఎపీ (మోడిఫైడ్ ఇన్సూరెన్స్ మెడికల్ ప్రాక్టీషనర్), ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) టై -అప్ ఆసుపత్రులను ఎంపానెల్ చేయడం చేసి కొత్త డీసీబీఓలను (డిస్పెన్సరీ కమ్ బ్రాంచ్ కార్యాలయాలు) ఏర్పాటు చేయడం ద్వారా వైద్యసేవలను అందిస్తారు.అంతేకాకుండా, దేశవ్యాప్తంగా 23 కొత్త 100 బెడ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ఈఎస్ఐసీ నిర్ణయించింది. వీటిలో మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ (నెల్లూరు), ఛత్తీస్గఢ్ (బిలాస్పూర్), గోవా (ముల్గావ్), గుజరాత్ (సనద్), మధ్యప్రదేశ్ (జబల్పూర్), ఒడిశా (ఝార్సుగూడ), పశ్చిమ బెంగాల్ (ఖరగ్పూర్)లలో నిర్మిస్తారు. ఈ ఆసుపత్రులతో పాటు 62 చోట్ల ఐదు డిస్పెన్సరీలను కూడా ప్రారంభించనున్నారు.
మహారాష్ట్రలో 48 డిస్పెన్సరీలు, ఢిల్లీలో 12 డిస్పెన్సరీలు హర్యానాలో 2 డిస్పెన్సరీలను తెరుస్తారు. బీమా ఉన్న కార్మికులు వారిపై ఆధారపడిన వారికి ఇవి క్వాలిటీ ట్రీట్మెంట్లను అందిస్తాయి. 157 జిల్లాల్లో ఈఎస్ఐ స్కీము లబ్ధిదారులు ఇప్పటికే టై-అప్ల వల్ల క్యాష్లెస్ ట్రీట్మెంట్లను పొందుతున్నారు. తెలంగాణలోని సనత్నగర్, రాజస్థాన్లోని అల్వార్లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో రెండు క్యాథ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తారు.