పదేండ్లలో దేశంలో అవినీతిరహిత పాలన : ఈటల రాజేందర్ 

పదేండ్లలో దేశంలో అవినీతిరహిత పాలన : ఈటల రాజేందర్ 
  • ప్రపంచంలోనే శక్తివంతమైన నేత మోదీ 
  • కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే..

చేవెళ్ల, వెలుగు :  దేశంలో పదేండ్లుగా అవినీతి రహిత పాలన అందిస్తూ బీజెపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని బీజేపీ సీనియర్ నేత, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్  పేర్కొన్నారు.  చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గురువారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.

వారికి ఈటల రాజేందర్  కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అంతకు ముందు చేవెళ్లలో బీజేపీ నేతలు భారీగా ర్యాలీ తీశారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిశక్తివంతమైన నేత  ప్రధాని నరేంద్రమోదీ అని కొనియాడారు. 80 కోట్ల మంది భారతీయులకు అన్నం పెడుతున్న మహనీయుడని పేర్కొన్నారు. అన్ని మతాలను మెప్పించి అయోధ్యలో రామమందిరం నిర్మించి 140 కోట్ల మందికి అంకితం చేసిన ఘనత ప్రధానికే దక్కుతుందన్నారు.

దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలంటే మరోమారు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చేవిధంగా ప్రజలు ఆశీర్వాదించాలని, చేవెళ్ల గడ్డపై కాషాయం జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.  దేశంలో జాతీయ వాదంతో బీజేపీ ముందుకుసాగుతుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి  తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, జిల్లా నేతలు ప్రభాకర్ రెడ్డి, రాందేవ్ రెడ్డి, జంగారెడ్డి, విఠల్ రెడ్డి,  మండల అధ్యక్షుడు పాండు రంగారెడ్డి, ఉపాధ్యక్షుడు కృష్ణగౌడ్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.